IMD Alert: భారత వాతావరణ శాఖ (IMD)తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణవ్యాప్తంగా మే 17 నుంచి ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
IMD Alert: అధిక ఉష్ణోగ్రత (Heavy Temperatures) తో పాటు వడగాలులు.. 20 వరకు జాగ్రత్త.. రాష్ట్రవ్యాప్తంగా మే 20 వరకు తీవ్రమైన ఎండలు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 41°C నుంచి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి వంటి జిల్లాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇలాంటి వాతవరణంలో అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని ఐఎండీ అధికారులు తెలుపుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు భగ్గుమంటున్నాడు. మే నెల మధ్యకు చేరడంతో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న మూడు నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఎండలకు తోడు తీవ్రమైన వడగాల్పులు (Heatwave) వీచే అవకాశం ఉన్నందున వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తాజా బులెటిన్ ప్రకారం.. మే 20 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎండలు ముదురుతుండటంతో తెలంగాణ ఆరోగ్య శాఖ (DPH) ప్రజలకు కీలక సూచనలు చేస్తూ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ (Heatstroke) తగిలే ప్రమాదం ఉందని, గందరగోళం, ఫిట్స్, గుండె వేగంగా కొట్టుకోవడం, శరీరం 40 డిగ్రీల కంటే ఎక్కువ వేడెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది.

ముఖ్యంగా మధ్యాహ్నం 11:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించాలని, గొడుగులు వాడాలని మరియు ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
మే 17 (ఆదివారం) నాటి అధికారిక వాతావరణ డేటా ప్రకారం.. తెలంగాణలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 38°C గా నమోదైనప్పటికీ, గాలిలో తేమ వడగాల్పుల కారణంగా ఉష్ణోగ్రత తీవ్రత (RealFeel) ఏకంగా 44°C గా అనిపించింది. రానున్న రోజుల్లో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు నేరుగా 43°C నుంచి 44°C కి చేరే అవకాశం ఉంది.





