Cockroach Janatha Party: దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ‘కాక్రోస్ జనతా పార్టీ(Cockroach Janta Party (CJP)’కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ వ్యంగ్య రాజకీయ ఉద్యమం… ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, సోషల్ మీడియా యూజర్లు ఈ పార్టీ పోస్టులు, మీమ్స్, వీడియోలను భారీగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. అసలు ఇది ఎలా పుట్టింది? దీనిని ఎవరు స్థాపించారు? పూర్తి వివరాల్లోకి వెళితె..
Cockroach Janatha Party: ఈ ‘కాక్రోస్ జనతా పార్టీ’ అసలు రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక వ్యంగ్యాత్మక డిజిటల్ ఉద్యమం. దేశంలోని యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పరీక్షల లీకులు, వ్యవస్థపై అసంతృప్తి, రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించేందుకు ఈ వేదికను రూపొందించారు. ముఖ్యంగా ‘యువతను కాక్రోచులు, పరాన్నజీవులతో పోల్చారు’ అనే వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఈ ఉద్యమం వేగంగా పుట్టుకొచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.
పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో..
ఈ ఉద్యమానికి కారకుడిగా నిలిచిన వ్యక్తి అభిజీత్ దీప్కే. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్కు చెందిన అభిజీత్… సోషల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తిగా చెబుతున్నారు. గతంలో ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీతో అనుబంధం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆయన అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదివినట్లు కూడా సమాచారం వెలుగులోకి వచ్చింది.

కాక్రోస్ పార్టీ ప్రారంభం వెనుక ప్రధాన ఉద్దేశం… ‘వ్యవస్థపై యువత అసంతృప్తిని మీమ్స్, సెటైర్, డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో బయటపెట్టడం’ అని అభిజీత్ చెబుతున్నాడు. ‘సాధారణ యువత గొంతుక’గా ఈ ఉద్యమాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్లు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నాడు. ఈ పార్టీ తమను ‘యూత్ కోసం… యూత్ చేత… యూత్ పార్టీ’గా ప్రచారం చేసుకుంటోంది.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ పార్టీ సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు చేరడంతో ఇది దేశ రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం, CJP ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు భారతీయ జనతా పార్టీ అధికారిక అకౌంట్ కంటే ఎక్కువయ్యారని పేర్కొన్నారు.
వివిధ రిపోర్టుల ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) 9 మిలియన్లు, 10 మిలియన్లు, 11 మిలియన్లు దాటి, కొన్నింటిలో 12.7 మిలియన్ల వరకు చేరిందని చెబుతున్నారు. తాజా రిపోర్టులలో ఇది BJP ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను కూడా దాటేసిందని పేర్కొన్నారు; BJPకి సుమారు 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ ఉద్యమానికి యువత నుంచి భారీ స్పందన రావడానికి ప్రధాన కారణం… ఇది పూర్తిగా మీమ్ కల్చర్ ఆధారంగా నడవడం. రాజకీయ విమర్శలను సీరియస్ ప్రసంగాల కంటే హాస్యాత్మక పోస్టులు, వైరల్ వీడియోలు, వ్యంగ్య నినాదాల రూపంలో ప్రజలకు చేరవేస్తోంది. దీంతో Gen-Z యువత ఈ ఉద్యమంతో ఎక్కువగా కనెక్ట్ అవుతోంది.
ఈ పార్టీ వైరల్ కావడం వెనుక నిరుద్యోగులు, యువత ఆగ్రహంపై జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా నిరుద్యోగులను “బొద్దింకలు, సోమరిపోతులు” అన్నట్లుగా సంబోధించిన వ్యాఖ్యలపై నిరసనగా ఈ పార్టీ పుట్టిందని రిపోర్టులు చెబుతున్నాయి.కథనాల ప్రకారం, ఆ వ్యాఖ్యలు యువతలో ఉన్న నిరాశను మరింత రెచ్చగొట్టాయి. ఆ తర్వాత అభిజీత్ దీప్కే అనే యువకుడు దానికి వ్యంగ్య ప్రతిస్పందనగా “కాక్రోచ్ జనతా పార్టీ”ని మొదలుపెట్టారు.
అయితే ఈ పార్టీపై విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు దీన్ని ‘డిజిటల్ ప్రొపగాండా’గా అభివర్ణిస్తుంటే… మరికొందరు ‘ఇది యువత ఆవేదనకు ప్రతీక’ అంటున్నారు. సోషల్ మీడియాలో కొందరు దీనిని నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా చూస్తుండగా… ఇంకొందరు ఇది కేవలం వైరల్ ట్రెండ్ మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. Reddit వంటి ప్లాట్ఫామ్లలో కూడా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే… ఈ పార్టీ అధికారిక రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద నమోదు కాలేదు. ప్రస్తుతం ఇది పూర్తిగా ఆన్లైన్ ఉద్యమంగానే కొనసాగుతోంది. కానీ సోషల్ మీడియాలో పెరుగుతున్న ప్రభావం చూస్తుంటే… భవిష్యత్తులో ఇది నిజమైన రాజకీయ వేదికగా మారుతుందా? అనే చర్చ మొదలైంది. కొందరు రాజకీయ విశ్లేషకులు “ఇది డిజిటల్ యుగంలో కొత్త తరహా రాజకీయ సంస్కృతికి సంకేతం” అంటున్నారు.
ఇక మరోవైపు, ఈ ఉద్యమం సోషల్ మీడియా రాజకీయాల శక్తిని మరోసారి బయటపెట్టింది. ఒక మీమ్ ఉద్యమం… కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడం… సంప్రదాయ రాజకీయ పార్టీలను కూడా ఆలోచనలో పడేసింది. “కాక్రోస్ జనతా పార్టీ” నిజంగా రాజకీయాల్లోకి వస్తుందా? లేక ఇది కేవలం డిజిటల్ తిరుగుబాటుగానే మిగిలిపోతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.





