తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం AIADMK తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పార్టీలోని ఓ వర్గం విజయ్ నేతృత్వంలోని TVK మద్దతు తెలపడం హాట్ టాపిక్ అయింది..
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం AIADMK (ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీలో ఏర్పడిన చీలిక, కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ నేతృత్వంలోని TVK (తమిళగ వెట్రి కజగం)కి మద్దతు తెలపడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

AIADMK (ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం) పార్టీలోని సీనియర్ నేతలు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం EPS నుంచి విడిపోయింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. వీటిలో ఒకటి.. EPS తనను తాను ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవడానికి ప్రతిపక్షమైన DMK మద్దతు కోరారని అంటున్నారు. ద్రావిడ రాజకీయాల్లో బద్ధశత్రువులైన DMKతో చేతులు కలపడం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని తిరుగుబాటు వర్గం ఆరోపించింది. మరొకటి.. ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయంగా మనుగడ సాగించాలంటే అధికారంలో భాగస్వాములు కావాలని ఈ వర్గం భావించింది. కేవలం ప్రతిపక్షంలో కూర్చుంటే పార్టీ బలహీనపడుతుందని, అందుకే కొత్త ప్రభుత్వంతో చేతులు కలపాలని వారు నిర్ణయించుకున్నారు.
నాయకత్వలేమి లోపమే కారణమా?

AIADMKలో తాజా వివాదం నాయకత్వ లేమి కారణంగా తెలుస్తోంది. ఒకప్పుడు సంచలన విజయాలు సాధించిన ఈ పార్టీ జయలలిత ఓటమి తరువాత ఏన్నో రకాలు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ పార్టీ ఎడప్పాడి ఈ.పళనిస్వామి బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఈయన నేతృత్వంలో ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా పార్టీకి కంచుకోట లాంటి పశ్చిమ తమిళనాడు (కొంగు బెల్ట్)లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తలు నిరాశ చెందుతున్నారు. జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వంపై అసంతృప్తి మొదలైంది. పార్టీ పదేపదే ఓడిపోతుండటంతో క్యాడర్లో నైరాశ్యం పెరిగిందని, దీనికి బాధ్యత వహిస్తూ నాయకత్వ మార్పు జరగాలని ఒక వర్గం డిమాండ్ చేసింది.
TVK (విజయ్ పార్టీ)కి మద్దతు ఎందుకు?

నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధించి కొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో AIADMK నుంచి విడిపోయిన తిరుగుబాటు వర్గం (సుమారు 20-30 మంది ఎమ్మెల్యేలు) TVKకి మద్దతు ప్రకటించింది. AIADMK పునాదే DMK వ్యతిరేకతపై ఉంది. ప్రస్తుతం TVK కూడా DMKని గట్టిగా వ్యతిరేకిస్తోంది. కాబట్టి సిద్ధాంతపరంగా తమకు TVK దగ్గరని తిరుగుబాటు నేతలు భావిస్తున్నారు. రాబోయే కాలంలో తమిళనాడులో TVK మరియు DMK మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, అప్పుడు AIADMK కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అందుకే విజయ్ ప్రభుత్వంలో భాగస్వాములు కావడం ద్వారా తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారు.
ప్రస్తుతం AIADMKలో EPS వర్గం ఒంటరిగా పోరాడుతుండగా, వేలుమణి-షణ్ముగం వర్గం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ క్యాబినెట్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది AIADMK చరిత్రలో జయలలిత మరణం తర్వాత వచ్చిన అతిపెద్ద సంక్షోభంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.





