ఎక్కడైతే రామ భజన జరుగుతుందో అక్కడ హనుమంతుడు కచ్చితంగా ఉంటారని భక్తులు నమ్ముతారు. అంతే కాకుండా దుష్టశక్తులను సంహరించి భక్తులను కాపాడుతూ వారి నుంచి నిత్యం పూజలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి అంటే చాలామందికి ఇష్టమే. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు.. ఆంజనేయస్వామిని దర్శించడం వల్ల ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని నమ్ముతారు. దీంతో ప్రతి గ్రామంలో, పట్టణంలో ఆంజనేయ స్వామి ఆలయం తప్పకుండా ఉంటుంది. అయితే ఓ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 54 ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ప్రతి వేసవికాలంలో ఈ ఆలయాలు నిత్యం ఆంజనేయస్వామి నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి. ఇంతకీ ఆ గ్రామం ఏదో తెలుసా?
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామం గురించి ఆంజనేయ స్వామి భక్తులు ప్రత్యేకంగా చర్చించుకుంటారు. అంతేకాకుండా ఈ గ్రామాన్ని ఆంజనేయస్వామి దీక్షాపరులు సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వీధికో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అంతేకాకుండా ప్రతి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా వీధికో ఆలయం ఏర్పడడానికి ఒక చరిత్ర ఉంది.
పూర్వకాలంలో ఈ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబాలు అధికంగా ఉండేవి. వీరు ఎక్కువగా హనుమంతుడిని పూజించేవారు. దీంతో ఎవరికి వారు హనుమాన్ ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత వీరు గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఆలయాలు మాత్రం అలాగే ఉన్నాయి. గ్రామస్తులు ఈ ఆలయాలను సంరక్షిస్తూ స్వామి వారికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.
వేసవికాలంలో హనుమాన్ దీక్ష చేపడుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో ప్రతి ఆలయంలో హనుమాన్ దీక్ష పరులు ఉంటారు. దీంతో ఏ వీధికి వెళ్లినా హనుమాన్ భజనలే వినిపిస్తూ ఉంటాయి. గ్రామంలోని వారే కాకుండా చుట్టుపక్కల వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామి వారికి పూజలు చేస్తూ ఉంటారు.అయితే ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు ఇతర ఆలయాలు 20 ఉన్నాయి. ఇలా మొత్తం 70 ఆలయాలు ఉన్నాయి.