మూడు రోజులుగా భారీ వర్షాలతో వరదలు ఏరులై పారాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఏపీలోని విజయవాడ నగంలో నీటిలో మునిగింది. ముఖ్యంగా సింగ్ నగరంతో పాటు విజయవాడ టౌన్, నందమూరి నగర్, రామకృష్ణాపురం ప్రాంతాలు నీటిలో మునిగాయి. ఈ ప్రాంతంలో ఒకటో అంతస్తులో ఉన్న ఇళ్లు దాదాపు నీటిలోనే మునిగిపోయాయి. ఇక్కడ ఉన్న దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీరికి ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్లు పడవలు, జేసీబీలు, డ్రోన్లు ద్వారా ఆహార సరుకులు అందిస్తున్నారు. అయితే ఈ వరద విలయానికి కారణం బడమేరు వాగు ఉప్పోంగడమే అంటున్నారు. అసలు ఈ వాగు ఎక్కడ ప్రారంభమైంది? ఇలా పొంగడానికి కారణమేంటి?
బుడమేరు వాగు మైలవరం కొండల్లో ప్రారంభమవుతుంది. ఇది ఆరిగిపల్లి, కొండపల్లి అనే కొండల మధ్య చిన్న ధారగా ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంటుంది. చివరగా కొల్లేరు సరస్సులో కలుస్తుంది. అయితే ఇది ఎక్కువగా విజయవాడ నగరంను ఆనుకోని వెళ్తుంది. ప్రతీ సంవత్సరం వర్షాల సమయంలో బుడమేరులో గరిష్టంగా 10 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తు ఉంటుంది. 2005లో గరిష్టంగా 75 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది.
ఇటీవల మరోసారి బుడమేరుకు భారీ వరద రావడంతో విజయవాడ అల్లకల్లోలంగా మారింది. ఆగస్టు 31 నుంచి విజయవాడ ఎగువ భాగాన భారీ వర్షపాతం నమోదైంది. మూడు రోజుల్లో దాదాపు 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో బుడమేరు వాగును ఆనుకొని ఉన్న ప్రాంతాలైన పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరు పాడు, వైఎస్సార్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. అయితే బుడమేరులో 17 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించినా ఎలాంటి ముప్పు ఉండదు. కానీ తాజాగా 45 వేల క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా ప్రవహించింది. దీంతో ఒక్కసారిగా ఈ వాగు పరివాహక ప్రాంతాలన్నీ నీటి మునిగాయి.
అయితే బుడమేరు వాగు విజయవాడ నగరం వద్దకు రాగానే విశాలంగా ఉంటుంది. కానీ ఈ వాగు పక్కన కొందరు ఆక్రమణలు చేయడంతో వాగులో ప్రవహించిన వరదనీరు ఇళ్లలోకి వెళ్లాయని అంటున్నారు. మరోవైపు ఈ వాగులో ఎప్పటికీ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటిదివ వర్షాకాలంలో అత్యధికంగా నీరు రావడంతో విజయవాడ నగరం నీటిలో మునిగింది.