ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్ర లోకి వెళ్తాడని, ఆ తరువాత కార్తీకంలో వచ్చే ఉత్తమ ఏకాదశి నాడు తిరిగి మేల్కోంటాడని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాయాన ప్రారంభంలో వచ్చే తొలి ఏకాదశి పర్వ దినాన్ని విష్ణు భక్తులు పరమ పవిత్ర, ఉపవాస, జాగరణతో, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు
ఉత్తరయాణంలో కంటే దక్షిణాయాణంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో మార్పుల అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. అందువల్ల ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించాలి. దీంతో పెద్దలు రకరకాల పూజలు ఆచరించాలని అప్పట్లోనే నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మేలు చేస్తుంది. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను హింసించాడని ఒక చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో మహావిష్ణువు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఈ సందర్భంలో శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని అడుగుతాడు. తాను విష్ణు ప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుంటుందట. దీంతో అప్పటినుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.
సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు వరంను పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీసుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతం ఆచరించినట్లు చరిత్ర చెబుతోంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఈరోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామం, పారాయణం, విష్ణుకు సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. పరిసటి రోజు ద్వాదశి నాడు దేవాలయాలకు వెళ్లి ఉపవాస దీక్ష విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.