Monday, September 7, 2026

BRS Protest : నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ నిరసన.. అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత

BRS Protest : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల రంగు టీషర్టులు ధరించి గన్‌పార్క్‌ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు. అసెంబ్లీకి వెళ్లే ముందు బీఆర్ఎస్‌ నేతలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో వాగ్వాదం

అయితే నల్ల టీషర్టులు ధరించిన బీఆర్ఎస్‌ నేతలను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల టీషర్టులతోనే అసెంబ్లీలోకి వెళ్తామని బీఆర్ఎస్‌ నేతలు పట్టుబట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు బీఆర్ఎస్‌ నేతలు కిందపడిపోయారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.

కంటతడి పెట్టిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చొక్కా విప్పి హరీశ్‌రావు నిరసన

మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత హరీశ్‌రావు అసెంబ్లీ గేటు వద్ద తన చొక్కా విప్పి నిరసన తెలిపారు. ప్రభుత్వంపై తమ నిరసనను మరింత తీవ్రంగా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణం సమీపంలో హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేటీఆర్‌ సహా పలువురు నేతల అరెస్ట్‌

హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి కేటీఆర్‌, మరికొందరు బీఆర్ఎస్‌ నేతలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ మధ్య రాజకీయ వేడి రాజుకుంది.

తొలిరోజే నిరసనలు, అరెస్టులు, వాగ్వాదాలతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మరింత వాడీవేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ హామీల అమలు, ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News