నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, నదుల ఉధృతికి అనేక ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక బ్యాంకుకు సంబంధించిన లాకర్ కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది. నదిలో కొట్టుకొచ్చిన ఈ లాకర్ను గుర్తించిన కొందరు వ్యక్తులు దాన్ని పగలగొట్టి చూడగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. అయితే ఆ డబ్బును బ్యాంకుకు అప్పగించకుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆ తరువాత ఏం జరిగిదంటే?
నేపాల్ లోని ధాడింగ్ పోలీసులు తెలిపిన ప్రకారం.. రసువా జిల్లాలో ఇటీవల వరదలు విజృంభించాయి. ఈ క్రమంలో భోటే కోశి అనే ప్రాంతంలో ఓ బ్యాంకు లాకర్ కొట్టుకొచ్చింది. దీనిని గుర్తించిన కొందరు స్థానికులు దానిని బయటకు తీసుకొచ్చారు.లాకర్ను తెరిచి చూడగా.. అందులో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ డబ్బును సొంతం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టారు.బ్యాంకు లాకర్లోని నగదును అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 29 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వారి వద్ద నుంచి 92.68 లక్షల నేపాలీ రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.57 లక్షలు ఉంటుందని సమాచారం.
స్వాధీనం చేసుకున్న నగదు ఏ బ్యాంకుకు చెందినది? లాకర్లో మొత్తం ఎంత డబ్బు ఉంది? వరదల సమయంలో లాకర్ ఎలా కొట్టుకుపోయింది? వంటి అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లాకర్కు సంబంధించిన బ్యాంకు రికార్డులు, నగదు వివరాలు పరిశీలించి అసలు నష్టపోయిన మొత్తం ఎంత అనే విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు.
నేపాల్లో వర్షాకాలంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, నదుల ఉద్ధృతి కారణంగా పలు ప్రాంతాలు ప్రభావితమవుతుంటాయి. ఇలాంటి సమయంలో బ్యాంకులు, దుకాణాలు, ఇళ్లు వంటి నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ ఘటనలో బ్యాంకు ఆస్తుల్లో భాగమైన లాకర్ నదిలోకి కొట్టుకుపోవడం, అనంతరం అందులోని నగదు బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో ఇతరుల ఆస్తులు లేదా కొట్టుకొచ్చిన విలువైన వస్తువులు కనిపిస్తే వాటిని సొంతం చేసుకోవడం చట్టపరంగా సమస్యలకు దారితీయవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో దొరికిన ఆస్తుల విషయంలో చట్టాన్ని పాటించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.





