నేటి కాలంలో ఆసుపత్రికి వెళ్లాలంటే భయమేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిట లాడుతున్నాయి. వ్యాధుల సీజన్ కావడంతో చాలా మంది బాధితులు ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది బిజీగా ఉంటున్నారు. దీంతో అత్యవసర సేవలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కానీ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైపు అత్యవసర సేవలు అందిస్తూనే.. మరోవైపు అవసరమైన ఆపరేషన్లు నిర్వహించారు. అయితే ఇవి సాధారణమైతే ప్రత్యేకత ఏముంటుంది? అనుకోవచ్చు. కానీ ఈ ఆసుపత్రి వారు 24 గంటల్లోనే 23 ఆపరేషన్లు నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెలితే..
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మాత్రం తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఇక్కడికి వచ్చేవారు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో ఓ వైపు వారికి అవసరమైన చికిత్సతో బిజీగా ఉంటున్నారు. మరోవైపు ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

తాజాగా సెప్టెంబర్ 6వ తేదీన ఒక్కరోజే 23 ఆపరేషన్లు నిర్వహించారు. వీటిలో 10 డెలివరీలు, 2 గర్భసంచిలో ఉన్న కణతి, 5 సాధారణ శస్త్ర చికిత్సలు, 5 ఆర్థో ఆపరేషన్లు, ఒకటి కంటి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆసుపత్రికి చెందిన సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ల సహాయంతో ఈ ఆపరేషన్లు నిర్వహించారు. అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు అందుబాటులో స్కానింగ్, పోస్టుమార్టం తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్య సిబ్బంది తెలుపుతున్నారు.