UPI Payment Rules : కేంద్ర ప్రభుత్వం యూపీఐ, డెబిట్ కార్డ్ చెల్లింపులపై చార్జీల విధింపుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలతో కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు, మర్చంట్లకు అవగాహన కల్పించేందుకు ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల పార్లమెంట్ లో సర్వీస్ ప్రొవైడర్లు అదనంగా చార్జీలు వసూలు చేసేలా బిల్లు పాస్ చేశారు. కానీ దీనిపై వినియోగదారుల నుంచి అయోమయం నెలకొనడంతో తాజాగా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10ఏ కింద కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఈ అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది. దీని ప్రకారం, నిర్దేశించిన డిజిటల్ విధానాల ద్వారా చెల్లింపులు చేసే లేదా స్వీకరించే వ్యక్తుల నుంచి బ్యాంకులు కానీ, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు (Google Pay, PhonePe, Paytm వంటివి) కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి రుసుములు (చార్జీలు) వసూలు చేయకూడదని ఆదేశించింది.

ఇందులో భాగంగా రూ.2,000 వరకు జరిపే యూపీఐ లావాదేవీలపై, అలాగే రూపే డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఎలాంటి చార్జీలు విధించడం నిషేధించబడినట్లు తెలిపింది. ఒకవేళ రుసుములు వర్తిస్తే, అవి ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) పద్ధతిలోనే ఉంటాయని.. అంటే వ్యాపారులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, సాధారణ కస్టమర్ల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయరని స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య జరిగే సామాన్య లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి ఖాతాకు డబ్బులు పంపే విధానంపై ఎలాంటి చార్జీలు ఉండవు. అయితే, రూ.2,000 దాటి చేసే మర్చంట్ యూపీఐ లావాదేవీలపై లేదా నిర్దిష్ట కేటగిరీ లావాదేవీలపై చార్జీలు విధించేందుకు అవకాశాలు ఉన్నాయి.





