చదువు కొనలేము అని ఒకప్పుడు చాలామంది అనుకునేవారు.. కానీ ఇప్పుడు విద్య ఎవరి సొత్తు కాదు అన్నట్లు ప్రతి ఒక్కరూ చదువుకునేందుకు అవకాశం లభిస్తుంది. మారుమూల ప్రాంతాల్లోనూ విద్యావంతులుగా మారుతున్నారు. అయితే మారుమూల గ్రామాల్లో చదువుకునేందుకు అవకాశాలు లభించినా కొందరు ఉత్తీర్ణత కావడం లేదు. ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో 78 ఏళ్లుగా ఒక్కరు కూడా 10వ తరగతి పాస్ కాలేదు. కానీ ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఒకే ఒక్కడు ఉత్తీర్ణత సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఆ విద్యార్థి ఎవరు? అతని గురించి తెలుసుకోవడానికి ఈ వివరాల్లోకి వెళ్ళండి..

నేటి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు మారుమూల గ్రామాల్లోకి వెళ్తున్నాయి. అయితే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు కూడా పంపించడం లేదు. కొన్ని గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో తమ చిన్నారులను పనుల్లోకి పంపుతున్నారు. దీంతో వారికి చదువుకోడానికి అవకాశం రావడం లేదు. ఇలాగే ఉత్తరప్రదేశ్ లోని భారాబంకి జిల్లా నిజాంపూర్ గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ గ్రామానికి చెందిన రామ్ కేవల్ అనే విద్యార్థి పరిస్థితి కూడా అలాగే ఉండేది. కానీ తాను ఎలాగైనా చరిత్ర సృష్టించాలని అనుకున్నాడు.

కుటుంబానికి ఆర్థిక చేయూత అందించాలని అనుకున్న ఆ విద్యార్థి ఓ వైపు ఆదాయం కోసం పనిచేస్తూనే.. మరోవైపు చదువును కొనసాగించాడు. ఇంట్లో ఆర్థిక అవసరాల కోసం శుభకార్యాల ఊరేగింపులో లైట్ పట్టుకొని.. రూ.300 వరకు సంపాదించేవాడు. కానీ అతనికి చదువుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. దీంతో పట్టుదలతో స్కూలుకు వెళ్లి చదివి మిగతా వారికంటే ముందున్నాడు. ఫలితంగా ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే 78 ఏళ్లుగా గ్రామంలో ఇప్పటి వరకు ఒక్కరూ కూడా పాస్ కాలేదు. రామ్ కేవల్ ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాడు. దీంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అలాగే తన పై చదువులకు ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తానని నిజాంపూర్ జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాటి తెలిపినట్లు విద్యార్థి చెప్పాడు. చదువుకోవడానికి ఎన్నో సౌకర్యాలు ఉన్నా.. కొంత మంది చదువుకోవడం లేదు. అలాంటి వారికి ఈ విద్యార్థి ఆదర్శంగా నిలుస్తున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు.
