కొన్ని గవర్నమెంట్ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నవార్తలు చదువుతూ ఉంటాం. వీటిపై చర్యలు తీసుకోవాలని కొందరు కోరగా.. తాత్కాలికంగా వాటిని శుభ్రపరుస్తారు. కానీ ఆ తరువాత మళ్లీ అదే పరిస్థితికి వస్తాయి. అయితే నిత్యం వాటి పరిరక్షణకు ప్రత్యే శ్రద్ధ వహించాలని చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా.. కొందరు పట్టించుకోరు. ఈ సమస్యను గుర్తించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని పేరు ‘స్వచ్ఛ సాథీ వాష్ ఆన్ వీల్’. అంటే ఏదైనా కార్యాలయాల్లో టాయిలెట్ క్లీన్ చేయాలనుకునే వారికి ఒక్క ఫోన్ కొడితే చాలు.. వారు వెంటనే వచ్చి క్లీన్ చేసి పోతారు. అయితే ఇందుకు కొంత ఛార్జీ తీసుకుంటారు. స్వచ్ఛభారత్ భారత్ మిషన్ 2.0. కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు క్లీన్ గాఉండడమే కాకుండా పారిశుధ్య కార్మికులకు ఉపాధి కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఉపయోగపడనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో పారిశుధ్యంపై శ్రద్ధ వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సక్సెస్ దిశగా వెళ్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న మరుగుదొడ్లు క్లీన్ గా ఉంచడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లా 2024 సెప్టెంబర్ 26న ‘స్వచ్ఛ సాథీ వాష్ ఆన్ వీల్’ అనే కార్యక్రమాన్ని గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రారంభించారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఉంచడంతో పాటు పారిశుధ్య కార్మికులకు ఉపాధిని కల్పించడానికి ఈ పథకం తోడ్పడుతుంది.
వాష్ ఆన్ వీల్ అనే పేరులోనే ఇది ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. పారిశుధ్య రంగంలో పనిచేయాలని ఉత్సాహం ఉన్న మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తరువాత వీరికి టాయిలెట్లు శుభ్రం చేయడానికి ఆధునిక పరికరాలు అందిస్తారు. అంతేకాకుండా వీరికి గమ్యానికి చేరుకోవడానికి వాహనాలను కూడా అందిస్తారు. వ్యక్తిగతంగా కూడా వీరు రక్షణ పొందేందుకు అవసరమైన కిట్లను అందిస్తారు.
అయితే అంగన్ వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల్లోఉండే టాయిలెట్లను క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ కార్యాలయ బాధ్యులు పారిశుధ్య కార్మికులకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ లో మెసెజ్ పెట్టాలి. లేదా క్యూర్ కోడ్ ద్వారా వారికి సమాచారం అందించాలి. దీంతో వారు క్షణాల్లో వచ్చి టాయిలెట్ క్లీన్ చేసి వెళ్లిపోతారు. ఇలా చేసినందుకు వీరికి 0.5 కిలోమీటర్ కు రూ.200…5 కిలోమీట్ కంటే ఎక్కువ దూరానికి రూ.250 వసూలు చేస్తారు. ఇలా వారికి నెలకు రూ.25 నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తుందని పారిశుధ్య కార్మికులు చెబుతున్నారు. ఈ పథకంతో ప్రభుత్వ కార్యాలయాల్లో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొంటున్నారు.