తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మోమోస్ తిని 50 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిలో రేష్మ బేగం అనే మహిళ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అక్టోబర్ 25వ తేదీన నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీల్లో జరిగిన సంతలో మోమోస్ ను విక్రయించారు. వీటిని తిన్న వారికి అప్పటి నుంచి అస్వస్థతకు గురవుతున్నారు. వీరిలో 10 మంది మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అసలు మోమోస్ అంటే ఏమిటి? ఈ వంటకాన్ని ఎలా తయారు చేస్తారు? ఇవి పాయిజన్ ఎలా అయి ఉంటాయి?
టిబెటిన్ల ఎక్కువగా ఇష్టపడే వంటకం మోమోస్. ఆ తరువాత దీనిని నేపాల్ లో ఎక్కువగా తయారు చేసుకున్నారు. క్రమంగా భారత్ లోని లడక్, సిక్కిం ప్రాంతాల్లో తయారు చేస్తారు. ఆ తరువాత దేశంలోని ప్రధాన నగరాల్లో వీటిని తయారు చేస్తున్నారు. మోమోస్ ను అనేక రకాలుగా తయారు చేస్తారు. వీటిలో వెజ్ మోమోస్ తో పాటు పనీర్ మోమోస్, చికెన్ మోమోస్, మష్రుమ్ మోమోస్ కూడా ఉంటాయి.హైదరాబాద్ లోని కొన్ని ప్రముఖ హోటల్లలో వీటిని విక్రయిస్తున్నారు. అయితే తాజాగా వీటిని ఓ సంతలో కూడా విక్రయించారు.

మోమోస్ తయారీల్లో అల్లం, వెల్లెల్లి తో పాటు క్యాబేజీ, క్యారెట్లు, చిన్నముక్కలుగా తీసుకొని మిశ్రమాన్ని తయారు చేస్తారు. వీటిలో సోయాసాస్, మిరియాలపొడి వంటిని ఉపయోగిస్తారు. ఈ మిశ్రమం తయారు చేసిన తరువాత మైదా పిండిని పూరీల లాగా చేసి అందులో ఈ మిశ్రమాన్ని ఉంచుతారు. మొత్తం ఒక ప్రత్యేక మైన ఆకారంలా చుట్టి ఇడ్లీ పాత్రలో లేదా మోమోస్ కు సంబంధించిన రేకుల్లో పెట్టి ఉడికిస్తారు. వెజ్ మోమోస్ కోసం ఇలా తయారు చేస్తారు. ఇదే పద్ధతితో చికెన్ మోమోస్ ను తయారు చేస్తారు.
తాజాగా హైదరాబాద్ లో నాణ్యత లేకుండా వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీటికి ఇచ్చే మిర్చి చట్నీ, మయోనీజ్ కారణంగానే ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..