కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి సెప్టెంబర్ 18న కేబినేట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన మంత్రుల బృందం ఆ తరువాత ఆమోదం తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసలు జమిలి ఎన్నికలు అంటే ఏమిటి? దీని నిర్వహణ వల్ల లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..
జమిలి ఎన్నికలు అనగా.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్. అంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం. ఈ విధానంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఈ బిల్లును కచ్చితంగా ఆమోదింప చేస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే 1967 వరకు దేశంలో లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆ తతరువాత 1968, 1969లో కొన్ని రాష్ట్రాలు ఈ విధానం నుంచి తప్పుకున్నాయి. 1970లో ముందస్తుగానే లోక్ సభ రద్దు కావడంతో ఉమ్మడి ఎన్నికలు చెదిరిపోయాయి.
జమిలి ఎన్నికలను ఆమోదించడానికి బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఈ విధానం ద్వారా దేశంలో చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతోంది. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా చాలా వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఖర్చులు కలిపి రూ. 60 వేల కోట్లు అయినట్లు ఓ రిపోర్టు తెలిపింది. 2024 ఎన్నికల్లో 1.35 లక్షల కోట్లు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ ఖర్చు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎలక్షన్ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో వారి విధులకు ఆటంకం కలుగుతోంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా వీరి పదే పదే ఎలక్షన్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు.
జమిలి ఎన్నికల ద్వారా నష్టాలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని ప్రాంతీయ పార్టీలు తాము సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. జాతీయ పార్టీల విధానాలతో ప్రాంతీయ పార్టీలు సరితూగలేవు. దీంతో చాలా సమస్యలు ఉంటాయి. 2015లో ఐడీఎఫ్ సీ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీతో పాటు దాని మిత్ర పక్షాలను ఎన్నుకోవడానికి ఓటర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దీంతో ప్రాంతీయ పార్టీలు మనుగడ సమస్య ఉంటుంది. అదే రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎలక్షన్స్ ఉంటే 61 శాతం వరకు ఓటర్లు మారుతారని తెలిపింది.
బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జమిలి ఎన్నికల విధానాన్ని తెరమీదకు తెచ్చింది. 2022లో ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రను కలిసి జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఈ ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల ముందే ఈ బిల్లుపై మాట్లాడగా.. గత జనవరిలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ బీజేపీ ఓడిపోతామనే భయంతో జమిలీ ఎన్నికలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ఈయనతో పాటు పలువురు ఆందోళన చేయడంతో దానినిపక్కనపెట్టారు. తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే పార్లమెంట్ లో ఎలాంటి చర్చలు ఉంటాయో చూడాలి.