ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దాదాపు 5 నెలల తరువాత జైలు నుంచి విడుదలయిన కేజ్రీవాల్ ఆదివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని అన్నారు. ప్రత్యర్థి బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో విచ్చీన్నం చేయాలని కుట్ర పన్నుతోందని, కానీ వారు విఫలమయ్యారని అన్నారు.
అయితే తాను రాజీనామా చేసిన తరువాత పార్టీకి చెందిన సభ్యుడు ఒకరు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఆన ఎవరు అనేది త్వరలో చెబుతానని అన్నారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికలతో పాటు దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తానని, ఆ తరువాత సీఎం పేరును ప్రకటిస్తామని అన్నారు.
సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందున తాము ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికలు ఉంటే ప్రజల వద్దకు వెళ్లి మా మద్దతు కోరుతామని చెప్పారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ నేను చెప్పేదేంటంటే.. మని రాజ్యాంగ దేశం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే మన లక్ష్యం అని అన్నారు.