తెలంగాణ లో వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీకి మారడంపై రవాణాశాఖకు పంట పండుతోంది. కొందరు కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు టీజీ పేరిట ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. తాజాగా ఓ సంస్థ తమ వాహన నెంబర్ కోసం రూ.25 లక్షలు చెల్లించింది. దీంతో టీఎస్ నుంచి టీజీ మారడంపై రవాణాశాఖకు ఆదాయం విపరీతంగా వస్తుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ ను ఇప్పటి వరకు ఉన్న TS ను TGగా మార్చాలని నిర్ణయించింది. దీంతో ఇటీవల రవాణాశాఖ ఆధ్వర్యంలో కొత్త వాహనాలకు TG రిజిస్ట్రేషన్ ను ప్రారంభించారు. అయితే పాత నెంబర్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్తగా కొనుగోలు చేసేవాహనాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. కానీ కొందరు తమ పాత వాహనాలకు సైతం ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్లను తీసుకుంటున్నారు. ఇందుకోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు.
తాజాగా ఆర్టీవో ఆఫీస్ ఆన్లైన్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ లో ఒక ఫ్యాన్సీ నెంబర్ ను ప్రముఖ సోనీ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్స్ భారీగా నగదు వెచ్చింది కొనుగోలు చేసింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణ కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ లో ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కోసం రూ. 25,50,002 చెల్లించి ఆ సంస్థ కొనుగోలు చేసింది. కంపెనీ యాజమాన్యం టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం కోసం ఈ నెంబర్ ప్లేట్ ను తీసుకున్నారు. కొత్త వాహన ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేయగా ఒకరోజులోనే రవాణా శాఖకు రూ.43,7284 ఆదాయం వచ్చింది అని అధికారులు తెలిపారు.
మార్చి నుంచి నగరంలో ఫ్యాన్సీ టీజీ నెంబర్ ప్లేట్ల వేలం ప్రక్రియ ప్రారంభ కావడంతో ఇప్పటివరకు ఆర్డిఏ శాఖకు రూ. 30 లక్షల ఆదాయం వచ్చింది. మొట్టమొదట టీజీ సిరీస్ లోని నంబర్ ప్లేట్లు టీజీ 09 001 వన్ వేలం వేయగా రూ.9.61 లక్షలకు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ తెలిపింది. ఫ్యాన్సీ నెంబర్ కావాలని ఎవరైనా ఆసక్తి చూపితే ముందుగా రూ. 50,000 చెల్లించి దానిని రిజర్వ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఒకటికంటే ఎక్కువ మంది సేమ్ నెంబర్ కావాలనుకుంటే మాత్రం బిడ్డింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.