Monday, May 18, 2026

Adhika Jyeshta masam 2026: అధిక జ్యేష్ఠ మాసం ఎలా పవిత్రం?

Adhika Jyeshta masam 2026:చంద్ర మాసాలు, సౌర సంవత్సరాల మధ్య ప్రతి 32 నెలలకు అదనంగా మాసం వస్తంది.ఈసారి అధిక జ్యేష్ఠమాసం వచ్చింది.ఈ నెలలో పూజలు చేయడం పుణ్యప్రదం.

అధిక మాసం ఎలా ఏర్పడుతుంది?

Adhika Jyeshta masam 2026: అధిక మాసం ఏర్పడటానికి ఖగోళ శాస్త్ర పరమైన కారణం ఉంది. చంద్ర క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరం సుమారు 354 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే సౌర సంవత్సరం 365 రోజులు ఉంటుంది. ఈ రెండు మధ్య వచ్చే 11 రోజుల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి రెండున్నర నుంచి మూడేళ్లకోసారి ఒక అదనపు నెలను చేర్చుతారు. అదే అధిక మాసం. దీనివల్ల పంచాంగ గణనలు సమతౌల్యంలో ఉంటాయి. 2026లో మే నెల 17 నుంచి జూన్ 17 వరకు అధిక జ్యేష్ఠమాసం రానుంది.

పురోషోత్తమ మాసం..

పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ అదనపు నెలకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోయిందట. ఇతర మాసాలు దానిని హేళన చేయడంతో ఆ మాసం మహావిష్ణువును ప్రార్థించిందని చెబుతారు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన పేరైన “పురుషోత్తమ” పేరును ఈ మాసానికి ఇచ్చి అత్యంత పవిత్రమైన నెలగా ప్రకటించాడని విశ్వాసం. అందుకే ఈ కాలంలో విష్ణు ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంటుంది.

పంచెలు కట్టుకొని నిప్పు కట్టెలతో యుద్ధం.. ఈ వింత ఆచారం దక్షిణ భారత్లో ఎక్కడంటే.. – insightearth.in – Telugu News Portal

పూజలు, వ్రతాలు..

Adhika Jyeshta masamలో ముఖ్యంగా శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు, సత్యనారాయణ స్వామిని భక్తితో పూజిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం, శ్రీమద్భాగవతం వినడం, హరినామ స్మరణ చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సత్యనారాయణ వ్రతాలు, అన్నదానాలు, దీపారాధనలు కూడా నిర్వహిస్తారు. ఈ మాసంలో దానధర్మాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. బియ్యం, గోధుమలు, నెయ్యి, పండ్లు, వస్త్రాలు, నీటి పాత్రలు, గొడుగులు, చెప్పులు వంటి వాటిని దానం చేస్తే విశేష పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా వేసవి కాలంలో దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా మంచి కార్యంగా భావిస్తారు.అధిక మాసంలో ఉపవాసాలు, జపాలు, ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని చెబుతారు. ఉదయం స్నానం చేసి దేవాలయ దర్శనం చేయడం, తులసి పూజ చేయడం, గోవులకు ఆహారం పెట్టడం వంటి కార్యాలు కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం చాలామంది ఈ నెలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శుభకార్యాలకు సెలవు..
అయితే ఈ మాసంలో కొన్ని శుభకార్యాలను సాధారణంగా నివారిస్తారు. ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, వాహన కొనుగోళ్లు, ఇంటి నిర్మాణ ప్రారంభాలు వంటి కార్యక్రమాలు చేయరాదని పండితులు సూచిస్తారు. ఎందుకంటే ఈ మాసం భౌతిక శుభకార్యాల కంటే ఆధ్యాత్మిక సాధనకు కేటాయించబడిన కాలంగా భావిస్తారు.

అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన ఆచారాలు ఉండవు. కొన్ని కుటుంబాలు తమ సంప్రదాయాల ప్రకారం సాధారణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అందువల్ల ఏ శుభకార్యమైనా చేపట్టే ముందు కుటుంబ పండితులను లేదా జ్యోతిష్యులను సంప్రదించడం మంచిదని చెబుతారు.

మొత్తంగా అధిక జ్యేష్ఠ మాసం అనేది కేవలం అదనపు నెల మాత్రమే కాదు, ఆధ్యాత్మిక చింతనకు, భక్తి మార్గంలో ముందుకు సాగేందుకు ప్రత్యేకమైన సమయం. ఈ కాలంలో భగవంతుని ఆరాధిస్తూ దానధర్మాలు చేస్తే పుణ్యం, మనశ్శాంతి, సానుకూల ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News