ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల విడుదల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,45,263 అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 13వ తేదీని ప్రాథమిక కీ ని రిలీజ్ చేశారు. అయితే ఇది చూసుకున్న చాలా మంది అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత విద్యారంగ నిపుణులతో కలిసి ఫైనల్ గా మరో కీ ని సెప్టెంబర్ 6న విడుదల చేశారు. అయితే దీని తరువాత కొన్ని రోజుల్లోనే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ తేదీని ప్రకటించడం లేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయంపై ఆరోపణలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో డీఎస్పీ ఫలితాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెప్టెంబర్ 5 వరకు టీచర్ల నియామకాలు చేపడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదల చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తుందని అన్నారు. డీఎస్సీ పరీక్షను చాలా మంది వాయిదా వేయాలని కోరినా.. హడావుడిగా ప్రభుత్వం నిర్వహించిందని, కానీ ఇప్పుడు ఫలితాలు ప్రకటించడంలో ఆలస్యం ఎందుకు చేస్తుందో చెప్పాలని అన్నారు.
అయితే డీఎస్పీ పరీక్షల ఫలితాల తుది కీపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కొన్ని ప్రశ్నలకు పుస్తకాల్లో ఉన్న సమాధానాలు రాసినా.. వాటికి మార్కులు వేయలేదని అన్నారు. ఈ మేరకు కొందరు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. అంతేకాకుండా కొంత మంది అభ్యర్థులు టెట్ వివరాలు తప్పుడుగా నమోదు చేశారని అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీటిపై సవరణకు సెప్టెంబర్ 13వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. కానీ ఎవరూ సరిచేసుకోలేదు. ఇక జీఆర్ఎల్ ఇచ్చిన తరువాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాలను డీఈవోకు పంపించాలి. కానీ ఇప్పటి వరకు జీఆర్ఎల్ విడుదల చేయలేదు.
అంతేకాకుండా సెప్టెంబర్ 5 వరకు నియామకాలు ఉంటాయని ప్రభుత్వం చెప్పినా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడ లేదని కొందరు వాపోతున్నారు. అయితే ఇది మరింత ఆలస్యం అయితే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే గత పదేళ్లుగా టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీని నిర్వహించింది. ఎంతో ఆశతో చాలా మంది ఈ పరీక్షలకు హాజరైన వారు ఇప్పుడు ఫలితాల ప్రకటనలో జాప్యం చేయడంపై నిరాశతో ఉన్నారు.