విదేశీయుల విషయంలో భారత ప్రభుత్వం ఇక నుంచి పకడ్బందీగా వ్యవహరించనుంది. ఇందులో భాగంగా 2025 మార్చి 11న లోక్ సభలో ‘Imigration And Foeigners Bill 2025′ ను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారత్ లోకి వలసదారులను నియంత్రించడానికి ఈ బిల్లు పనిచేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. విదేశీయులు భారత్ లోకి అక్రమంగా చొరబడకుండా.. నకిలీ పాస్ పోర్టు పొందేవారి విషయంలో ఈ బిల్లు పకడ్బందీగా వ్యవహరిస్తుందని తెలిపారు. అసలు ‘ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లు 2025’ అంటే ఏమిటి? ఇందులో ఏలాంటి అంశాలను చేర్చారు?
కేంద్ర హోంశాఖ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. విదేశీయులు భారత్ లో పర్యటించడానికి ఇక నుంచి పాస్ పోర్ట్ తో పాటు వీసా తప్పనిసరి అవసరం. ఇప్పటి వరకు పాస్ పోర్టు సహాయంతో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. విదేశీయుల గురించి ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. విదేశీయులు ఎక్కడ వసతి చేస్తారో.. ఏ హోటల్ లో ఉంటున్నారో.. వారి వివరాలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులు యూనివర్సిటీల్లో విద్యనభ్యసించినట్లయితే వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలి. విద్యార్థులు, వైద్య పరిశోధన నిమిత్తం భారత్ లోకి విదేశీయులు వస్తే 14 రోజుల లోపు వారి వివరాలు నమోదు చేసుకోవాలి. పాకిస్తాన్ జాతీయులైతే 24 గంటల లోపు నమోదు చేసుకోవాలి. విదేశీయులు భారత్ లోకి వచ్చినప్పుడు వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. రెండు, మూడు దేశాల్లో పౌరసత్వాన్ని కలిగిన వారిపై నిఘా ఉంచడం.. విదేశీయులను భారత్ లోకి ఎవరైతే తీసుకువస్తారో.. వారి వివరాలను నమోదు చేసుకోవడం.. వంటిని కొత్త చట్టం చేయనుంది.
విదేశీయులు భారత్ లోకి రావాలంటే పాస్ పోర్టు తో పాటు వీసాను భౌతికంగా పొందవచ్చు. లేదా ఏడు వర్గాల కింద ఆన్ లైన్ లో కూడా మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు పాస్ పోర్టు యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ పారినర్స్ యాక్ట్ 1939, పారినర్స్ యాక్ట్ 1946 వంటి చట్టాలు ఉన్నాయి. ఇవి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే పనిచేస్తున్నాయి. వీటి స్థానంలో కొత్తగా ‘ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లు 2025’ ను ప్రవేశపెట్టారు. అయితే భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో వీసా అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. వీటిలో అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు , ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్ లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు మొత్తం 98,40,321 మంది విదేశీయులు భారత్ కు వచ్చారు.