జగమంతటికి రాజు జగన్నాథుడు. అంటే లోకానికి రాజుగా కీర్తీంపబడే జగన్నాథుడి రథయాత్ర జూన్ 27 శుక్రవారం ఒరిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో సాగనుంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు దశవతారంలో ఒక అవతారం శ్రీకృష్ణుడినే జగన్నాథ స్వామిగా కొలుస్తారు. ప్రతీ ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే పూరి జగన్నాథ రథయాత్రకు లక్షల మంది తరలివస్తారు. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తారు. ఇక్కడ కనిపించే విగ్రహాలు చెక్కతో తయారు చేయబడినవి. కానీ ఇవి సగం వరకు మాత్రమే ఉంటాయి ఎందుకు? సాధారణంగా దేవాలయాల్లో పూజలు అందుకునే జగన్నాథుడు నగరమంతా రథయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ వివరాల్లకి వెళితే..
కొన్ని పురాణాల ప్రకారం.. మహావిష్ణువు అవతారాల్లో ఒకటి అయిన శ్రీకృష్ణుడిగా ఉన్న సమయంలో ఆ స్వామి చెల్లెలు సుభద్ర నగరమంతా సంచరించాలని కోరుతుందట. ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన సోదరుడు అయిన బలరాముడితో పాటు సుభద్రతలు కలిసి పూరిలో సంచరిస్తారట. ఈ సంచారం ఆషాఢమాసంలో జరిగిందని చెబుతున్నారు. అప్పటి నుంచి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైందని అంటున్నారు.
జగన్నాథ రథయాత్రలో ఉండే విగ్రహాలు చెక్కతో చేయడినవి. అయితే ఇవి నిలువు విగ్రహాల లాగా కాకుండా సగం వరకు మాత్రమే ఉంటాయి. ఇలా ఎందుకు ఉన్నాయో చరిత్ర ఉంది. పూర్వ కాలంలో విశ్వావసుడు అనే గిరిజనుడు జగన్నాథుడిని రహస్య ప్రదేశంలో పూజించేవాడట. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న అనే రాజు స్వామిని చూడడానికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్లేసరికి విగ్రహాలు మాయమవుతాయి. ఆ తరువాత నిరాశ చెందిన రాజు.. ఒకరోజు నిద్రిస్తున్న సమయంలో కలలో జగన్నాథుడు కనిపించి చాంకీనది తీరంలో ఉన్ వేప కర్రల ద్వారా విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు.
ఆ తరువాత విగ్రహాలు చేయించేందుకు శిల్పులకు కోసం ఎదురుచూస్తాడు. ఈ సమయంలో విశ్వకర్మ వికలాంగుడి రూపంలో ఇక్కడికి వచ్చి విగ్రహాలు చేస్తానని ఒప్పుకుంటాడు. అయితే ఒక షరతు విధిస్తాడు. తాను గదిలోకి వెళ్లి విగ్రహాలను తయారు చేస్తానని, విగ్రహాలు పూర్తయ్యే వరకు ఎవరూ తలుపులు తెరవొద్దని అంటాడు. ఈ షరతుకు రాజు ఒప్పుకుంటాడు. అయితే రాజు భార్య మాత్రం ఈ గది తలుపులు తెరవాలని అనుకుంటుంది. దీంతో ఒక్కసారిగా తలుపులు తెరవడంతో ఆ శిల్పి అదృశ్యమవుతాడు. దీంతో సగం వరకు తయారు చేసిన విగ్రహాలు అలాగే అంటాయి. అప్పటి నుంచి ఆ విగ్రహాలనే పూజిస్తూ వస్తున్నారు.