Tuesday, June 24, 2025

చార్ ధామ్ యాత్ర అంటే ఏమిటీ? ఇందులో ఎన్ని క్షేత్రాలు ఉంటాయి? ఇక్కడికి ఎలా వెళ్లాలి?

ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనతో మానసికంగా ప్రశాంతంగా మారుతారు. అందుకే చాలామంది ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించడం వల్ల మరింత ఉత్సాహంగా మారుతారు. వీటిలో చార్ ధామ్ యాత్ర ప్రత్యేకమైనది. చార్ అంటే నాలుగు. దేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించడాన్ని చార్ ధామ్ యాత్ర అంటారు. ఈ నాలుగు క్షేత్రాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. ఈ యాత్రలకు ఏప్రిల్, మే నెల అనుకూలమైనది. 2025 వ సంవత్సరంలో ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. అసలు ఈ చార్ ధామ్ యాత్రలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఉంటాయి?ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం..

యమునోత్రి:
చార్ ధామ్ యాత్రలో ముందుగా దర్శించుకునేది యమునోత్రి. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉన్న యమునోత్రి సముద్ర మట్టానికి సుమారు పదివేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ యమునోత్రి దేవాలయం ఉంటుంది. యమునా నది ఒడ్డున ఉండే ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగింది. ఇక్కడ వేడి నీటి బుగ్గ అయిన సూర్య కుండ్, దివ్యశీల వంటివి చూడొచ్చు. యమునోత్రిని 2025 సంవత్సరంలో ఏప్రిల్ 30 నుంచి దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవాలి?
సికింద్రాబాద్ నుంచి రైలు మార్గం లేదా హైదరాబాద్ నుంచి విమాన మార్గం ద్వారా ఉత్తరాఖండ్లోని రిషికేష్ కు చేరుకోవాలి. రిషికేష్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి క్యాబ్ లేదా ప్రత్యేక వాహనాల ద్వారా హనుమాన్ చట్టీకి చేరుకోవాలి. ఇక్కడికి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది. హనుమాన్ చెట్టి నుంచి గుర్రం లేదా కాలినడకన ఆలయం వరకు చేరుకోవచ్చు.

గంగోత్రి:
యమునోత్రి తర్వాత గంగోత్రిని దర్శించుకుంటారు. ఇది కూడా ఉత్తర కాశి జిల్లాలో కొలువై ఉంది. గంగోత్రిని గంగానది జన్మస్థలం గా పేర్కొంటారు. శివుని జటాజూటం నుంచి భూమిపై గంగ పడిన తొలి ప్రదేశమే గంగోత్రి అని అంటారు. ఇక్కడ గంగా మాత ఆలయం ఉంటుంది. అలాగే ఇక్కడ భగీరథుడు తపస్సు చేసిన శిలగా భావించే భగీరథ శిలను చూడొచ్చు. గంగోత్రి యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది.

ఎలా చేరుకోవాలి?
గంగోత్రికి నేరుగా వెళ్లాలంటే రిషికేష్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కానీ చార్ ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రిని దర్శించుకున్న తర్వాత మళ్లీ హనుమాన్ చట్టీకి రావాలి. అక్కడి నుంచి గంగోత్రికి బస్సు లేదా ప్రత్యేక వాహనాల్లో వెళ్లొచ్చు.

కేదార్ నాథ్ :
చార్ ధామ్ యాత్రలో భాగంగా మూడవ క్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. జ్యోతిర్లింగాలలో కేదార్ నాథ్ ఆలయం ఒకటి. మందాకిని నది సమీపంలో గర్ల్హాల్ హిమాలయ శ్రేణిలో ఈ ఆలయం కొలువై ఉంది. ఇది రుద్ర ప్రయాగ జిల్లాలో సముద్రమట్టానికి సుమారు 1175 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడున్న ఆలయాన్ని 8వ శతాబ్దంలో శంకరాచార్యులు నిర్మించారని చెబుతారు. అయితే ఈ ఆలయం 2025 సంవత్సరంలో మే 2న తెరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎలా చేరుకోవాలి?
కేదార్ నాథ్ ను నేరుగా రోడ్డు సౌకర్యం ద్వారా చేరుకోలేరు. హైదరాబాద్ నుంచి నేరుగా కేదార్ నాథ్ కు వెళ్లాలని అనుకునేవారు డెహ్రడూన్ వరకు విమానంలో వెళ్లొచ్చు. రైలు ప్రయాణం చేసేవారు హరిద్వార్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి గౌరీకుండ్ వరకు మాత్రమే వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి నేరుగా రోడ్డు సౌకర్యం లేనందున గుర్రాల మీదుగా లేదా కాలినడకన ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడికి హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు.

బద్రీనాథ్:
చార్ ధామ్ యాత్రలో భాగంగా చివరిది బద్రీనాథ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమౌలి జిల్లాలో అలక నంద నది తీరంలో సముద్ర మట్టానికి 3133 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీమన్నారాయణ కొలువై ఉన్నారు. స్కంద పురాణం ప్రకారం స్వర్గంలోనూ నరకం లోను అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా.. బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదని అంటారు. అలాగే ఇక్కడే భారత చివరి గ్రామం ‘మానా‘ కూడా చూడొచ్చు.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాదు నుంచి బద్రీనాథ్ కు నేరుగా వెళ్లేవారు రిషికేశ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. ఈ ఆలయం వరకు బస్సులు, కార్లు వెళ్తాయి. హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News