ఆషాఢ మాసం ను శూన్యమాసంగా పేర్కొంటారు. ఈ నెలలో ఎలాంటి పండుగలు నిర్వహించరు. అయితే మహిళలకు మాత్రం ఆషాఢం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ సమయంలో ప్రతి ఒక్క మహిళ చేతికి గోరింటాకు వేసుకుంటారు. దీనిని ఇప్పుడు ఒక కార్యక్రమంలా నిర్వహిస్తున్నారు. మహిళలంతా ఒక్క దగ్గరికి వచ్చి ప్రకృతిలో లభించే గోరింటాకును తెచ్చి రోకలిలో నూరి లేదా గ్రౌండర్ చేసి మహిళలంతా కలిసి వేడుకలా నిర్వహించుకుంటున్నారు. గోరింటాకు ఈ సమయంలో ఎందుకు వేసుకోవాలో పెద్దలకు తెలుసు. కాన నేటి తరం వారికి ఇది వింతగా అనిపిస్తుంది. ఇంతకీ గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు వేసుకుంటారంటే?
ఆషాఢమాసంలోనే గోరింటాకును చేతికి వేసుకోవడం వెనుక శాస్త్రీక కారణాలున్నాయి. ఎండాకాలం ముగిసిన తరువాత వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాతావరణం కలుషితం అవుతుంది. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా చేతితో పనులు చేస్తారు. ఇల్లు శుభ్రం చేసే పని కూడా మహిళలదే. ఇలాంటి సమయంలో చేతికి ఎన్నో రకాల క్రిములు అంటుకుంటాయి. వీటి వల్ల శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా చేతికి గోరింటాకు ధరిస్తారు.

గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది ధరించడం వల్ల శరీరం నిత్యం వేడిగా ఉంటుంది. దీంతో వాతావరణంలో ఉన్న ఎలాంటి కలుషితాన్నైనా తట్టుకునే శక్తి వస్తుంది. పురాణాల్లో గోరింటాకు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. పెళ్లికాని యువతులు గోరింటాకు ధరించిన తరువాత బాగా ఎర్రబడితే.. ఎర్రటి మొగుడు వస్తాడని కొందరు అంటుండేవారు. అయితే ఏ విధంగా చూసినా గోరింటాకు ధరించడం వల్ల శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. అందువల్ల ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పనిసరిగా ధరించడం అలవాటు చేసుకోవాలి.