భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 78 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లళ్లో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి కి కారణం స్వేచ్ఛా జీవితం. ఇది రావడానికి కారణమైన స్వాతంత్య్ర పోరాట రోజులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.అందుకే ప్రతీ ఆగస్టు 15న జెండా పండుగ నిర్వహిస్తున్నారు. చిన్నా, పెద్దా, కుల,మత, బేధం లేకుండా ఈ పండుగలో అందరూ పాల్గొంటాున్నారు. భారతదేశ స్వాతంత్య్రం గురించి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. కానీ ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినంను ఎందుకు ఎంచుకున్నాం? అనే సందేహం కొందరిలో ఉంది. అలాగే ఆరోజు ఏం జరిగింది? అనే ఆసక్తి నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే
అప్పటి వరకు అంటే 1947 ఆగస్టు 15న నాటికి బ్రిటిష్ ప్రభుత్వ ప్రధానిగా క్లెమెంట్ అట్లీ ఉన్నారు. అప్పటికే స్వాతంత్య్ర పోరాటం చివరి దశకు వచ్చినందున మన దేశాన్ని విడిచిపెట్టాలని బ్రిటిష్ వాళ్లు నిర్ణయించుకున్నారు. అయితే ఏ రోజున స్వాతంత్య్ర దినంను ప్రకటించాలి? అనే సందేహం ఏర్పడింది. భారతదేశానికి చివరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ మాత్రం తమకు ఇష్టమైన తేదీ కావాలని అన్నారు. దీంతో ప్రధాని, బ్రిటిష్ వైస్రాయ్ కలిసి ఆగస్టు 15న నిర్ణయించారు. వాస్తవానికి ఈ తేదీని ఎందుకు ఎంచుకున్నారని అడిగినప్పుడు.. అణు బాంబు తరవాత 1945 ఆగస్టు 15 జపాన్ లొంగిపోయింది. దీంతో ఈ సరెండర్ ను స్వీకరించిన మౌంట్ బాటన్ తన సొంత విజయానికి గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నట్లు తెలిపాడు. ఆ సమయంలో మౌంట్ బాటన్ దక్షిణాసియా కమాండర్ గా ఉన్నాడు.
ఇక 1947 జూలై 18న భారత స్వాతంత్య్రం చట్టం ఆమోదించబడింది. ఆ సమయంలో ఉమ్మడి భారత్ ను రెండు భాగాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఆగస్టు 14 న భారతదేశం, పాకిస్తాన్ రెండు భాగాలుగా మారింది. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న వైస్రాయ్ మౌంట్ బాటన్ కొత్తగా ఏర్పడిన రెండు దేశాలకు అధికారాలను బదిలీ చేశారు. అయితే ఢిల్లీ, కరాచీలో ఒకేసారి ఉండలేనందున ముందుగా కరాచీలో ఉన్న ఆయన పాకిస్తాన్ కు అధికారాన్ని బదలాయించారు. దీంతో భారత్ కంటే ముందుగానే పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆగస్టు 15న ఉదయం జిన్నాతో పాటు మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ విషయాన్ని 2016లో ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్టు సాహిది కాజీ పేర్కొన్నారు.ఆ తరువాత భారత్ లోనూ ఆగస్టు 15న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 15 మంది సభ్యులతో ప్రధాని అయ్యారు.