తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడి ఎన్నిక తేదీ ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జూలై 1న బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. అయితే అధ్యక్షుడు ఎవరా? అని చాలా మంది ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గత పాలనలో ఉన్న బీఆర్ ఎస్ పై అనేక ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే అని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికయ్యే నాయకుడిపై అనేక బాధ్యతలు ఉండనున్నాయి.
కొన్ని వర్గాల సమాచారం మేరకు బీజేపీ అధ్యక్ష రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కొందరు మరోసారి బండి సంజయ్ కి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ బండి సంజయ్ కి కేంద్ర సహాయక మంత్రి పదవి ఉన్నందున ఆయనకు ఇచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు. ఎక్కువగా ఈటల రాజేందర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈటల రాజేందర్ ఇటీవల బీఆర్ ఎస్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కొందరు గుర్రుగా ఉన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ పార్టీనే నేరుగా ఢీకొట్టడానికి బీజేపీనే ప్రత్యామ్నాయం అని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికయ్యే నేత కాస్త శ్రమిస్తే కాంగ్రెస్ ను మట్టి కరిపించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నా.. ఓవరాల్ గా బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే కొత్తగా ఎన్నికయ్యే నేత పార్టీని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకువస్తారో చూడాలి.