కోరిన కోరికలు తీర్చే కొమురవెల్లి మల్లన్న స్వామి అంటే భక్తులకు మహా ఇష్టం. ప్రతీ ఆదివారం ఆ మల్లన్న స్వామి పాటలు, పూజలతో తన్మయత్వం పొందుతూ ఉంటారు. కొందరు ప్రతీ ఆదివారం మల్లన్న స్వామి కోసం ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే మల్లన్న స్వామి అనగానే కొమురవెల్లి గుర్తుకు వస్తుంది. కానీ ప్రస్తుతం అనేక చోట్ల మల్లన్న స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా పురాతన కాలంలోనూ మల్లన్న స్వామి ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతోంది. ఇవి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో ‘దొంగ మల్లన్న ఆలయం’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రతీ ఆదివారం , బుధవారం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే షష్టివారాల్లో ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే?
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ప్రతీ ఆదివారం మల్లన్న భక్తులు సందడి చేస్తుంటారు. ఇక్కడున్న మల్లన్న స్వామికి దొంగ మల్లన్న స్వామి అనే పేరు ఉంది. మహాశివుడి వరంతో జన్మించిన మల్లన్న స్వామిని పురాతనం నుంచే కొలుస్తున్నారు. అయితే ఈ ఆలయానికి దొంగమల్లన్న అనే పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో ఇప్పటి జగిత్యాల జిల్లాలోని పొలాస పాలకులకు చెందిన ఆవులను కొందరు దొంగిలించారట. ఈ ఆవులను తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో కొందరు గుర్తించారు. దీంతో తాము పాలకులకు దొరికిపోతే శిక్షిస్తారని భయపడి మల్లన్న స్వామిని వేడుకున్నారట. తాము దొరికిపోకుండా ఆవుల రంగు మారిస్తే ఉంటే గుడి కట్టిస్తామని మల్లన్న్ స్వామిని వేడుకున్నారట. వారి మొర ఆలకించిన శివుడు వారిని కాపాడట. దీంతో వారు రాత్రికి రాత్రి మల్లన్న స్వామి ఆలయం కట్టించినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయానికి దొంగమల్లన్న స్వామి ఆనే పేరు వచ్చింది.

ఆ తరువాత పలువురు భక్తులు ఈ ఆలయానికి వెళ్లడంతో ప్రసిద్ధి గాంచింది. ప్రతీ ఏడాది డిసెంబర్ లో షష్టి వారాల సమయంలో ఈ ఆయలనికి భక్తులు పోటెత్తుతారు. ఇక్కడికి వచ్చిన వారు బిందెల్లో బోనాలు వండి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలి వస్తారు.షష్టి వారాల్లో ప్రతీ ఆదివారం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు కూడా ఉన్నారు.
