సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, కొందరు ప్రముఖుల జాతకాలు చెప్పే ఆస్ట్రాలజర్ వేణుస్వామి విషయంలో కోర్టు ఆసక్తికర విషయాన్ని వెలువరించింది. నాగచైతన్య, శోభితకు లేని బాధ మీకెందుకు? అని తెలంగాణ మహిళా కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆగ్రహం పై సర్వత్రా చర్చ సాగుతోంది. అసలేం జరిగిందంటే?
ఇటీవల అక్కినేని నాగచైతన్య, శోభితల వివాహ నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. ఈ వివాహంపై ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో అక్కినేని నాగ చైతన్య, శోభిత విడిపోతారని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోపై అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై కామెంట్స్ చేస్తున్నారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొందరు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను కలిశారు. దీంతో మహిళా కమిషన్ నుంచి వేణు స్వామికి నోటీసులు పంపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొంది.
అయితే వేణు స్వామి ఈ విషయంపై సింగిల్ కోర్టు బెంచ్ ను ఆశ్రయించాడు.ఈ సందర్భంగా కోర్టు తీర్పును వెలువరించింది. వేణుస్వామికి అందిన నోటీసులు చెల్లవని తెలిపింది. అంతేకాకుండా ఈ విషయంలో నాగచైతన్య, శోభితకు లేని సమస్య మీకెందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వేణు స్వామి విషయంలో మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా గతంలో నాగచైతన్య, సమంత కూడా విడిపోతారని వేణు స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే వారు విడిపోయారు. దీంతో వేణు స్వామి జాతకంపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు కోర్టు తీర్పు కూడా వేణు స్వామికి అనుకూలంగా రావడంపై ఈ వార్త మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.