తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే చాలామంది భయపడిపోతున్నారు. అయితే అత్యవసర పరిస్థితులను మొత్తం కొందరు బయటకు వెళ్లక తప్పడం లేదు. ఇలా వెళ్లినవారు ఎండవేడికి తట్టుకోలేక వడదెబ్బకు గురవుతున్నారు. వీరితోపాటు కూలీ పనులు ఇతర పనులు చేసేవారు సైతం వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.
2025 సంవత్సరంలో వడదెబ్బల తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు India meteorological department (IMD) ముందుగానే హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అలర్ట్ అయింది. హీట్ వేవ్, సన్ స్ట్రోక్ తో మరణించిన వారికి ఇకనుంచి ఎస్ డి ఆర్ ఎఫ్ కింద ఆపద్బంధు పేరుతో ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు దీని కింద రూ. 50,000 మాత్రమే అందించింది. తాజా ప్రకటనతో వడదెబ్బ పరిహారం పెరిగింది.
వేసవి కాలంలో ఉపాధి హామీ పనులుకు వెళ్లిన వారు ఎండదెబ్బకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఇలాంటి వారు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మధ్యాహ్నం సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో మజ్జిగ, నిమ్మరసం వంటి సాధారణ పానీయాలు మాత్రమే తీసుకోవాలని కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని తెలుపుతున్నారు.