ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నూమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తు ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల 19న చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ లో విద్యాభ్యాసం..
సీతారాం ఏచూరి 1952లో మద్రాసులో ఉన్న తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సర్వేశ్వర సోమయాజులు, కల్పకం. సీతారాం ఏచూరి హైదరాబాద్ లోనే పెరిగారు. ఆయన పదో తరగతి వరకు హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో విద్యనభ్యసించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ సమయంలో ఆయన ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్ చేరారు. ఇక్కడ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు.
కొడుకును బలి తీసుకున్న కొవిడ్..
సీతారాం ఏచూరి జర్నలిస్టు సీమా చిస్తీని వివాహం చేసుకున్నారు. ఆమె ది వైర్ ఎడిటర్. అయితే అంతకుముందే ఆయన మీనా ముజుందార్ కుమార్తె ఇంద్రాని ముజుందార్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆశిష్ ఏచూరి 2021 ఏప్రిల్ 22న కోవిడ్ కారణంగా మరణించారు.

జెఎన్ టీయూలో మూడు సార్లు అధ్యక్షుడిగా..
సీతారాం ఏచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI)తో చేరారు. ఏడాది తరువాత సీపీఎంలో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో JNTUలో విద్యార్థిగా ఉన్న సమయంలోనే పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్టు కూడా అయ్యారు. ఆ తరువాత 1977లో నుంచి మూడు సార్లు జెఎన్ టియూ విద్యార్థి యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
రాజ్యసభ సభ్యుడిగా..
1978లో ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఆ తరువాత కేరళ అధ్యక్షుడిగా పనిచేశాడు. 1984 లో సీపీఎం కేంద్ర కమిటీలో భాగస్వాములయ్యారు. 2005లో సీతారాం ఏచూరి పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇండో అమెరికా అణు ఒప్పందం కోసం చర్చల సమయంలో ప్రకాశ్ కారత్ చేత తిరస్కరించబడ్డాడు.