తెలంగాణలో రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబూతూ వస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. శనివారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో కొందరు కొత్త సభ్యులను కలిపేందుకు 11,33,881 దరఖాస్తులు చేసుకున్నారు. కొత్త కార్డుల కోసం 10 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులను చేర్చే ప్రక్రియను ముందుగా చేయనున్నారు. ఆ తరువాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తారు. కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలను విధించింది. గ్రామాల్లో రూ.1.50 వేలతో పాటు 3.50 ఎకరాలు మాగాని, 7.5 ఎకరాల చెలక లోపు వారికి రేషన్ కార్డులు ఇస్తారు. పట్టణాల్లో 2 లక్షల ఆదాయం లోపు వారికి కొత్త కార్డులను అందిస్తారు.
ప్రస్తుతం ప్రతి ఏటా చౌకధరల దుకాణాలతో పాటు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితేచాలా మంది దొడ్డుబియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు. మరికొన్ని రకాలుగా ఇది దారి మల్లుతుండడంతో ప్రజలకు ఉపయోగపడడం లేదు. దీంతో రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తే పేదలకు ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి వర్గం నిర్ణయించింది.
ఇక చాలా మంది ఆరోగ్య శ్రీ కార్డు కోసమే రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులను పెపరేట్ గా ఇవ్వనున్నారు. దీంతో రేషన్ కార్డు లబ్దిదారుల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు భారం తగ్గుతుంది. ఆరోగ్య శ్రీ కార్డులను ప్రత్యేకంగా అర్హులకు జారీ చేయనున్నారు. ఇక రాష్ట్రంలో 65 ఏళ్లు, ఆపైన వయసు ఉన్న వారికి అన్నపూర్ణ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.