పెట్రోల్, డీజిల్ ధరలపై వినియోగదారులు ఎప్పటికీ ఆసక్తి చూపుతూ ఉంటారు. నిత్యావసరమైన పెట్రోల్ ప్రస్తుతం రూ.100కు పైగానే విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తగ్గినట్లే తగ్గి మరోసారి పెరిగాయి. గత ఎన్నికల సమయంలో రూ. 2 ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అప్పటి నుంచి ధరలు పెద్ద స్థాయిలో పెరగలేదు. అయితే తాజా పరిస్థితులను చూస్తే పెట్రోల్ ధరలు మరోసారి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ కారణాలతో పాటు మరికొన్ని పరిస్థితుల దృష్టా పెట్రోల్ ధరలపై వినియోగదారులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. అదెలా ఉంటే..
2024 సెప్టెంబర్ 6న పెట్రోల్ ధరలు ముంబైలో రూ.103.44 ఉండగా.. హైదరాబాద్ లో రూ.107.41తో విక్రయిస్తున్నారు. డీజిల్ ను రూ.95.65తో అమ్ముతున్నారు. గతంలో రూ.110 వరకు విక్రయించిన ఈ ధరలు రూ.100 నుంచి రూ.105 మధ్యలోనే ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం క్రూడాయిల్ బ్యారెల్ ధర 70 డాలర్లు గా కొనసాగుతుంది. 2022లో దీని ధర 115 డాలర్లుగా ఉండేది. దీని ప్రకారం చూస్తే అంతర్జాతీయంగా ఏర్పడతున్న పరిస్థితుల కారణంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
అయితే మన దేశంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రూ. 2 తగ్గించారు. ఇప్పుడు హర్యాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై పెట్రోల్ ధరల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి ఎంతో కొంత తగ్గింపు ఉంటుందని ఆశిస్తున్నారు.మరోవైపు పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలు చమురు సరఫరాను పెంచే అవకాశం ఉంది. వీటిలో లిబియా ఒకటి ఉంది. వచ్చే అక్టోబర్ నుంచి సరఫరా పెంచనున్నట్లు ప్రకటించడంతో పెట్రోల్ ధరల తగ్గింపు ఉంటుందని ఆశిస్తున్నారు.