భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’విజయవంతమైందని ఆర్మీ సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ మీట్ పెట్టి అధికారిక ప్రకటన చేయనుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఉగ్రశిబిరాలపై దాడులు మొదలుపెట్టిన భారత ఆర్మీ దాదాపు ఉగ్రమూలాలను అంతం చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం దాడికి భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు. అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు?
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలోని పర్యాటకులపై ఏప్రిల్ 22వ తేదీన చూట్టూ ఉన్న ఫారెస్ట్ నుంచి కొందరు ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరిపారు. అయితే ఇక్కడ మహిళలను వదిలి కేవలం పురుషులను నిర్దాక్షిణ్యంగా కాల్చారు. కొందరు దంపతులు ఉంటే మహిళల ఎదుటే తమ భర్తలను కాల్చారు. కొత్తగా పెళ్లయి హనీమూన్ కు వెళ్లిన జంటలపై కూడా కాల్పులు జరిపి కన్నీళ్లను మిగిల్చారు. వీరిలో హర్యానాకు చెందిన 26 ఏళ్ల లెప్టినెంట్ వినయ్ నర్వాల్, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన శుభమ్ ద్వివేదికి కొన్ని నెలల కిందటే పెళ్లి జరగగా.. వీరు కాల్పుల్లో మరణించారు.
ఈ కాల్పులతో వారి సతీమణులు నుదుట సింధూరాన్ని కోల్పోయారు. అయితే ఈ దాడి జరిగిన తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇది కేవలం పౌరులపై దాడి మాత్రమే కాదని.. యావత్ భారతదేశానిపై జరిగిందని.. మరోసారి ఇలా మహిళల నుదుట సింధూరాన్ని తొలగిపోకుండా దాడులు చేస్తామని అన్నారు. ఇందులో భాగంగానే ఈ ఆపరేషన్ కు ‘సింధూర్’ అని నామకరణం చేశారు. నుదుట కుంకుమను సింధూర్ గా పిలుస్తారు. అందువల్ల ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులను మట్టికరిపిస్తామని భారత సైన్యం చెబుతోంది.
అందులో భాగంగానే మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన దాడుల్లో ఉగ్రశిబిరాలను పేల్చేశారు. ఇందులో ముఖ్యమైన వారు మరణించినట్లు తెలుస్తోంది. అయితే భారత ఆర్మీ బుధవారం అధికారిక ప్రకటన చేసిన తరువాత వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.