తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో అపశృతి నెలకొంది. బుధవారం ఉదయం హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో వేసిన చలువ పందిళ్లు ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆలయ ఆధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు వేశారు.
అయితే ఒక్కసారిగా ఈ చలువ పందిళ్లు కూలిపోయాయి. దీని కింద 15 మంది భక్తులు చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా భక్తులు 108 ఆంబులెన్స్లకు ఫోన్ చేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు అంజన్న ఆలయం తెలంగాణలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. హనుమాన్ స్వామి ఇక్కడి కొండపై ఉన్నాడని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం చిన్న జయంతి, పెద్ద జయంతి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హనుమాన్ మాల విరమణ కోసం తరలివస్తారు.





