తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గత కొంతకాలంగా భద్రతా బలగాలు కర్రెగుట్ట అడవులను చుట్టుముత్తాయి. అయితే బుధవారం మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్ గర్ రాష్ట్రం బస్తర్ ఐజి సుందర్ రాజ్ పి, సిఆర్పిఎఫ్ ఐజి రాకేష్ అగర్వాల్ తెలిపారు. అయితే ఇక్కడ ఇంకా కాల్పులు కొనసాగుతూ ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారని సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు గత నెల నుంచి ఇక్కడ ప్రత్యేక ఆపరేషషన్ ను చేపట్టాయి. మావోయిస్టుకు చెందిన అగ్రనేత హిడ్మా తో పాటు దేవా లు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారి లక్ష్యంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ పదిహేను రోజులుగా కూంబింగ్ నిర్వహించి గత నెల 27న ఎన్కౌంటర్ నిర్వహించారు. ఆ సమయంలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా జరిగిన కాల్పుల్లో 22 మంది చనిపోవడంతో మావోయిస్టు పార్టీకి భారీగా దెబ్బ పడినట్లు తెలుస్తోంది.
అయితే కర్రెగుట్ట ఆపరేషన్ ను నిలిపివేయాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కర్రెగుట్ట ను కొనసాగిస్తుంది.