కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం తాజాగా కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘LIC బీమా సఖి స్కీం’ పేరిట ఉన్న ఈ పథకాన్ని డిసెంబర్ 9న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలో ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ఎల్ఐసి బీమా సఖి స్కీం ద్వారా మహిళలు అదనపు ఆదాయాన్ని పొందవచ్చునని, ఈ స్కీం కోసం ప్రభుత్వమే శిక్షణ ఇస్తుందని తెలిపారు. అయితే దీని అర్హతలు ఏంటి? దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ వివరాల్లోకి వెళితే..?
‘LIC బీమా సఖి యోజన’ లక్ష్యం అనేది మహిళలను ఎల్ఐసీ ఏజెంట్లుగా చేయడం. ఇందులో భాగంగా కొందరు మహిళలను ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఆ తర్వాత పాలసీలపై అవగాహన పెంచుకునేందుకు మహిళలకు అవకాశం ఇస్తారు. ఇందుకోసం మూడేళ్ల పాటు శిక్షణ కూడా ఇస్తారు. ఈ శిక్షణ కాలంలో మొదటి సంవత్సరం నెలకు రూ.7,000 స్టైఫండ్ అందిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ. 6,000.. మూడో సంవత్సరం నెలకు 5,000 చెల్లిస్తారు.
కనీసం పదవ తరగతి నుంచి గ్రాడ్యుయేట్ చదువుకున్న వారు ఎల్ఐసి బీమా సఖి స్కీంకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. అలాగే 18 నుంచి 70 సంవత్సరాల వయసులోపు ఉన్న మహిళలకు మాత్రమే ఈ స్కీంకు అర్హులు. అయితే ఇప్పటికే LICఏజెంట్లుగా ఉన్న ఉద్యోగుల బంధువులు, దరఖాస్తు చేసుకోరాదు. అలాగే LIC లో ఇదివరకు పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇది వర్తించదు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవారు చిరునామాకు సంబంధించిన ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందుబాటులో ఉంచుకోవాలి.
వెబ్సైట్ పై అవగాహన ఉన్నవారు https://.licindia.in/test2 అనే అధికారిక వెబ్సైట్లో సందర్శించాలి. ఇందులో బీమా సఖి లింకుపై క్లిక్ చేయాలి. ఇందులో పేరు, పుట్టిన తేదీ సహా వివరాలను అందించాలి. ఇదివరకు ఎల్ఐసి ఇండియా ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగి లేదా మెడికల్ ఎగ్జామినర్ తో కనెక్ట్ అయిన వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి .ఈ పథకంలో చేరిన వారు ఏడాదికి కనీసం 24 పాలసీలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మొదటి సంవత్సరం పాలసీలు విక్రయించడం ద్వారా కమిషన్ రూపంలో రూ. 48,000 అందుకుంటారు.