క్రికెట్ వరల్డ్ లో అత్యంత ఉత్కంట కలిగించే మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. ఇటీవల టీ 20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన పోరులో భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మరోసారి రెండు దేశాల మధ్య పోరు ఉండనుంది. అయితే ఇక్కడ అమ్మాయిల క్రికెట్ అని గుర్తుంచుకోవాలి. మహిళల ఆసియా కప్ టీ 20 టోర్నమెంట్ శుక్రవారం నుంచి శ్రీలంక లోని దంబుల్లాలోని రంగి దబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గ్రూప్ ఏ లో తొలి మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. టీమిండియాలో స్టార్ ఓపెనర్ స్మృతి మందాన ఫామ్ లో ఉన్నారు. హర్మన్ ప్రీత్, జెమీమా, దీప్తీ శర్మ ఫాంలోకి రావాల్సి ఉంది. అయితే బౌలర్లు కాస్త డల్ గా ఉండడం ప్రతికూల అంశం.

ఇదిలా ఉండగా వుమెన్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ ల మధ్య 14 మ్యాచులు జరిగాయి. వీటిలో 11 భారత్ గెలిచింది. ఈ టోర్నిలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ ఉన్నాయి. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, థాయ్ లాండ్ ఉన్నాయి. శుక్రవారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తో పాటు నేపాల్ వర్సెస్ యూఏఈ జట్లు తలపడనున్నాయి. కాగా భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.