ఆర్థిక వ్యవహారాలు నడపడానికి నేటి కాలంలో పాన్ కార్డ్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి.. లిమిట్ కి మించి డబ్బులు డిపాజిట్ చేయడానికి.. పాన్ కార్డు లేకపోతే కుదరదు. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా కొన్ని సందర్భాల్లో ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అడుగుతూ ఉంటారు. అయితే కొందరు పాన్ కార్డును ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఒకటికి మించి పాన్ కార్డులను కలిగి ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అంటే?
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆర్థిక వ్యవహారాలు జరిపే వారికి పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింకు చేసుకోవాలి. అలా చేయని పక్షంలో ఆర్థిక వ్యవహారాలు జరిపే అవకాశం ఉండదు. కానీ కొందరు ఈ లింకు చేయకుండానే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 272 బి కింద నేరమవుతుంది. దీంతో రూ. 10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకున్న తర్వాతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం. ఆస్తి కొనుగోలు చేయడం.. ఇతర ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం చేయాలి.
దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉంటుంది. కానీ కొందరు రెండు పాన్ కార్డులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా అక్రమంగా రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే.. ఐటీ చట్టం 1961 సెక్షన్ 272 బి ప్రకారం రూ. పదివేలు జరిమాల విధిస్తారు. అంతేకాకుండా పాన్ కార్డులో ఏవైనా పొరపాట్లు లేదా ఇంటిపేరు మార్చే క్రమంలో మరో పాన్ కార్డు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా రెండు పాన్ కార్డులను ఉపయోగించడానికి కొందరు ఉత్సాహం చూపిస్తారు. కానీ అలా చేయడం నేరమే అవుతుంది. రెండు పాన్ కార్డులు ఉన్న సమయంలో ఒకదానిని ఐటీ అధికారులకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. లేదా ఏదో ఒకదానిని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అందువల్ల పాన్ కార్డు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.