హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే చెరువులు, నాళాలు కబ్జాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాజకీయ, సినీ ప్రముఖలు అంటూ ఎవరినీ చూడకుండా నిర్దాక్షిణ్యంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసిన విషయం తెలిసింది. మరికొంది రాజకీయ నాయకుల కట్టడాలను కూడా హైడ్రా కూల్చి వేస్తుంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిని కూడా వదిలిపెట్టేది లేదని నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడికి హైడ్రా కు నోటీసులు పంపించింది. ఆయనకు సంబంధించిన సంస్థ నిర్మించిన కొన్ని కట్టడాలను కూల్చివేస్తున్నట్లు నోటీసులు పంపించింది. ఇంతకీ ఎవరా నటుడు?
తెలుగు చిత్ర సీమలో ఎంతో మంది సీనియర్ నటులు తమ ఆస్తులను హైదరాబాద్ లో కూడబెట్టుకున్నారు. హైడ్రా కారణంతో వారివి అన్నీ బయటపడుతున్నాయి. అయితే సక్రమంగా ఉన్న కట్టడాల జోలికి వెళ్లని హైడ్రా చెరువులు, నాళాలు కబ్జా చేస్తే మాత్రం ఊరుకోవడం లేదు. తాజాగా సీనియర్ నటుడు, జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్ అధినేత మురళీ మోహన్ కు హైడ్రా షాక్ ఇచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లోని రంగళాల్ కుంట చెరువు FTL, బఫర్ జోన్లో ఉన్న కట్టడాలని తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీ రథమ్మ చెరువును పరిశీలించారు.
అయితే ఈ నోటీసులపై జయభేరి ఆర్ట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కానీ ఈ నిర్మాణాలు మాత్రం అక్రమమేనని హైడ్రా తేల్చింది. ఇవే కాకుండా ఇక్కడ చాలా మంది అక్రమ కట్టడాలు నిర్మించారు. వారందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్లు హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ నిర్మించిన కట్టడాలపై పూర్తిగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఉన్న మురళీ మోహన్ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయనకు హైదరాబాద్ లో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తెలుగు సినీ ఇండస్ట్రీలో శోభన్ బాబు తరువాత మురళీ మోహన్ రియల్ ఎస్టేట్ రంగంలో రాణించినట్లు చెప్పుకుంటారు.
హైడ్రా నోటీసులపై మురళీ మోహన్ ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంద. సీనియర్ నటుడు నాగార్జున మాత్రం తనకు నోటీసులు వచ్చినప్పుడు తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. అంతేకాకుండా హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. కానీ అంతలోనే ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు. అయితే కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం తమ కట్టడాలు బపర్ జోన్లో ఉంటే కూల్చేయమని చెబుతున్నారు. మరి మురళీ మోహన్ తమ కట్టడాలను కూల్చివేస్తారా? లేదా కోర్టుకు వెళ్లారా? అనేది చూడాలి?