తలనొప్పి వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే జేబు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది నేటి కాలంలో.. రోగుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా కమర్షియల్ గా వ్యవహరించేవారు చాలా మందే ఉన్నారు. కానీ నేటి కాలంలో కూడా కొందరు మహానుభావులు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఓ డాక్టర్ తనకు వచ్చిన ఆదాయాన్ని సొంతంగా ఉపయోగించుకోకుండా పేదల కోసమే ఖర్చు పెడుతూ.. పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా.. పెళ్లి చేసుకోకుండా.. తన జీవితాన్ని మొత్తం సేవకే అంకితం చేసిన ఈ వైద్యుడు గురించి తెలిసిన తరువాత.. ఇలాంటి మహానుభావుడు ఇంకెక్కడైనా ఉంటారా? అని అనుకుంటున్నారు. మరి ఆయన ఎవరో తెలుసా?
ప్రముఖ వ్యక్తులకు అందించే పద్మశ్రీ అవార్డు పొందిన డాక్టర్ తపన్ కుమార్ లాహిరి పేరు చెబితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తెలియని వైద్యులు ఉండరు. ప్రస్తుత కాలంలో మిగతా రంగాల్లో కంటే వైద్యరంగంలోని ఎక్కువ ఆదాయం వస్తుందని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ రోగులు పెరుగుతున్నారు.. అయితే సరైన చికిత్స అందుబాటులోకి వస్తున్నప్పటికీ వీటి ఖర్చు పెరుగుతోంది. కానీ తపన్ కుమార్ లాహిరి మాత్రం ఎలాంటి బాధితుల నుంచైనా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. ఉచితంగా వైద్యం అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా తనకు వచ్చిన ఆదాయాన్ని పేదలకే పంచి పెడుతూ.. నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో 1941 జనవరి 3న తపన్ కుమార్ లాహిరి జన్మించారు. 1969లో ఇంగ్లాండులో MBBS, FRCS, MCS చదివిన ఈయన 1972లో కార్డియోథొరాసిక్ సర్జన్ లో ప్రత్యేకత సాధించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్ గా జీవితాన్ని ప్రారంభించారు.

అయితే ఆయన తన జీవితాన్ని పేద ప్రజలకే సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరిన సమయంలో ఆయనకు నెలకు సంపాదన రూ. 250. ఈ ఆదాయాన్ని అతడు తన జీవితం కోసం కాకుండా పేదలకు పంచాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ.. తనకు వచ్చిన ఆదాయం అంతా పేదలకే పంచుతూ వస్తున్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం గుర్తించింది. 2016లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందజేసింది. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలవడానికి లాహిరికి ఆహ్వానం వచ్చినా నిరాకరించారు. తనను కలవాలంటే ఓపిలో రోగులతో రావాలని చెప్పారని అంటున్నారు. అంతేకాకుండా ఒకప్పటి ప్రధాని చంద్రశేఖర్ సింగ్ కూడా ఆయనకు కలవాలని ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు.
తపన్ కుమార్ లాహిరి 1994 నుంచి తన జీతం మొత్తం పేదలకే అందిస్తూ.. సొంతంగా ఎటువంటి ఆదాయాన్ని ఉంచుకోలేదు. అంతేకాకుండా తాను పెళ్లి కూడా చేసుకోకుండా నిరాడంబరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. ఆయన 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన నిబద్ధతతో విధులు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు బనారస్ విశ్వవిద్యాలయానికి చేరుకొనే అప్పటినుంచి తన విధులను ప్రారంభించేవారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న తపన్ లహరి ద్వారా సాయం పొందిన వారు ఎంతోమంది ఉన్నారు.