తెలుగు రాష్ట్రాల్లో వాన విలయం సృష్టించింది. ఊరూ, వాడా మొత్తం నీటిలో మునిగింది. గోదావరి, కృష్ణ అని కాకుండా రెండు నదులు ఉగ్రరూపం చూడడంతో సమీప గ్రామాల్లో నీట మునిగాయి. వరద బాధితుల కోసం ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమై ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో నిమగ్నమయ్యాయి . అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వాన, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. తెలంగాణలో 16 మంది వరదల కారణంగా చనిపోయినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 5 వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలిపారు. అటు ఏపీలోనూ వరద బీభత్సం సృష్టించింది. విజయవాడలోని సింగ్ నగర్ మొత్తం నీటిలో మునిగిపోయింది. నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. వీరిలో ఎవరు ఎంత ఇచ్చారంటే?
ముందుగా స్పందించిన సినీ ఇండస్ట్రీ..
వరదల సాయం చేయడంలో సినీ ఇండస్ట్రీ ముందు ఉంటుంది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ అందరికంటే ముందుగా స్పందించారు. వరద విలయం చూసి తాను తీవ్రంగా మనో వేదన చెందానని అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి విరాళం అందించారు. మరో హీరో విశ్వక్ సేస్ సైతం స్పందించారు. తన వంతుగా రూ. 10 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు రూ.100 కోట్లు..
తెలంగాణలో వరదకు విలవిలలాడిన ప్రజలను చూసి ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటి చలించిపోయింది. ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ వరద బాధితులకు సాయం చేయడంతో ప్రభుత్వ అధికారులు కునుకు లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. అయితే తాము వరద బాధితులకు అండగా ఉన్నా.. ఉద్యోగుల సేఏసీ తరుపున ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే రూ. 100 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఆహార పదార్థాలసాయం..
ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ మేఘా వరద సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా విజయవాడలోని లక్షన్నర మందికి అల్పాహారం, భోజనం, వాటర్ బాటిల్స్ ను పంచింది. హైరే కృష్ణ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ కలెక్టరేట్ నుంచి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు.
సింహాచలం ఆలయం నుంచి.. మరోవైపు విజయవాడలోని బరమేడ వాగు ఉప్పొంగడంతో సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోయిన విషయం తెలిసిందే. వారికి సింహాచలం ఆలయం నుంచి 30 వేల పులిహోర ప్యాకెట్లు పంపినట్లు సమాచారం.