నేటి కాలంలో కొందరు ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా కొందరు సంతాన విషయంలో ఆడపిల్ల అని తెలియగానే భయపడిపోతున్నారు. అయితే అమ్మాయిలపై కొన్ని సంస్థలు ప్రత్యేకంగా అవగాహన కల్పించడంతో తల్లిదండ్రులకు అవగాహన వచ్చి ఆడపిల్ల మాత్రమే కావాలనే కోరుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఓ పారిశ్రామికవేత్తకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ ఆడపిల్లలు లేరు. అతనికి ఆడపిల్లలు అంటే ఎంతో ఇష్టం. ఆ కొరత తీర్చుకోవడానికి ఆయన ప్రతి ఆడపిల్లను తన కూతురుగానే భావిస్తారు. ఇలా తన కూతురు అయితే పెళ్లి చేసి పంపించాలి అని అనుకొని ఆయన పేదవారికి చెందిన.. తండ్రిలేని ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి వారికి కొంత నగదును కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాడు. ఇలా ప్రతీ సంవత్సరం 300 పెళ్లిళ్లూ చేస్తూ వస్తున్నాడు. ఇంతకు ఎవరు ఆయన? ఎందుకిలా చేస్తున్నాడు?

గుజరాత్ కు చెందిన మహేష్ సవాని బాయ్ గురించి చుట్టుపక్కల ప్రాంతాల వారు తెలియని వారు ఉండరు. వజ్రాల వ్యాపారి అయిన మహేష్ సవానినీ ’రత్నం’ అని కూడా పిలుస్తారు. మహేష్ సవానీ ప్రతి సంవత్సరం 300 మంది పేద అమ్మాయిలకు ఇలా చేస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 5,274 పెళ్లిళ్లు చేశారు. తనకు కూతురు లేదన్న లోటు తీర్చుకోవడానికి ఆయన ఈ మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొంటున్నారు. ఎంతోమంది ఆడపిల్లలకు తండ్రిలా ఉన్న మహేష్ ను చూడగానే ఇప్పటివరకు పెళ్లిళ్లు చేసుకున్న వారికి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి.
అయితే మహేష్ సవానీ బేసిగ్గా మధ్యతరగతి కుటుంబమే. ఈయన 1970 నవంబర్ 3 న గుజరాత్ రాష్ట్రంలోని భవాని నగర్ జిల్లా.. పాలితాన మండలం.. రాంపర్దా గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి వల్లభాయ్ కూలీ పని చేసేవారు. ఆ తర్వాత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. తండ్రి బాటలోనే మహేష్ సవాని 1990లో వజ్రాల వ్యాపార యూనిట్లను ప్రారంభించాడు. ఆ సంవత్సరంలో మొత్తం 35,000 వజ్రాలు ఉత్పత్తి చేసేవారు. ఇలా నెలకు 3 లక్షలకు పైగా వజ్రాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించాడు. అయితే 2003 నుంచి 2007 వరకు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. 2004 సంవత్సరంలో ముంబైకి ఆ తర్వాత మూడు సంవత్సరాలు బెల్జియం కు మారిన మహేష్ కష్టాలు తీరి మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ సమయంలో వ్యాపార వ్యూహాలను తెలుసుకొని అభివృద్ధి సాధిస్తూ వచ్చాడు.

ఆ తర్వాత మహేష్ పి పి సవాని గ్రూపు ఏర్పాటు చేసి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన నికర విలువ రూ.1,000 కోట్లు. అయితే తనకు వచ్చిన సంపదలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ 2021 జూన్ 27న గుజరాత్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీలో చేరారు.