శ్రావణమాసంలో అన్నాచెల్లెళ్లు ఆనందంగా జరుపుకునే వేడుక రాఖీ పండుగ. నేను నీకు రక్షా.. నువ్వు నాకు రక్ష.. అంటూ సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. ఈ రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ప్రతీ ఏడాది వచ్చే రాఖీ పండుగ కోసం అన్నాచెల్లెళ్లు ఎదురుచూస్తుంటారు. సాధారణంగా రాఖీ పండుగను ఉదయం 9 గంటల నుంచి జరుపుకుంటారు. కానీ 2024 ఏడాదిలో వచ్చే రాఖీ పండుగ రోజు భద్రకాలం ఏర్పడనుంది. దీంతో కొన్ని సమయాల్లో మాత్రమే రాఖీ పండుగ నిర్వహించుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. 2024 ఏడాదిలో శ్రావణ మాసంలో ఆగస్టు 19న రాఖీ పండుగ వస్తుంది. ప్రతీ శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు ఉదయం 5.52 గంటల నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది. భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. కొన్ని పురాణాల ప్రకారం రావణుడి సోదరి భద్ర దేవత రాఖీ పౌర్ణమి అనుకుని ఒకరోజు ముందే రావణాసురుడికి రాఖీ కట్టిందట. దీంతో రాముని చేతిలో మరణించిందని చెబుతారు. భద్రకాలంలో రాఖీ కడితే చెడు కలుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య చిచ్చులు ఏర్పడుతాయి. అందుకే కాలంలో ఎటువంటి ఉపయోగకరమైన పనులు చేయరు. అయితే రాఖీ పండుగ రోజు ఈ సమయంలో భద్రకాలం ఉన్నందున ఆ సమయంలో అస్సలు రాఖీ కట్టొద్దని అంటున్నారు.
మధ్యాహ్నం 1.32 గంటల తరువాత రాఖీ పండుగను నిర్వహించుకోవాలి. అయితే అప్పటి వరకు శుచి శుభ్రతతో ఉండాలి. రాఖీ కట్టే టప్పుడు సోదరుడు తూర్పు వైపు కూర్చోవాలి. సోదరి పడమర వైపు తిరిగి కట్టాలి. రాఖీ కట్టే సమయంలో సోదరుడు, సోదరీమణులు ప్రశాంతంగా ఉండాలి. కోపంతో రాఖీ కట్టించుకోకూడదు. అంతేకాకుండా కామ్ గా రాఖీ కట్టకుండా ‘యేన బద్దో బలీ రాజా దానవేంద్రో మహాబల: తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మాచల’ అని జపిస్తూ కట్టాలి. ఇలా చదవడం వల్ల అన్నా చెల్లెళ్లు జీవితాంతం కలిసి ఉంటారు.
రాఖీని కట్టని తరువాత దీనిని సోదరుడు కనీసం వారం రోజుల పాటు చేతికి ఉంచుకోవాలి. వీలు కాకపోతే రాఖీని ఏదైనా చెట్ల వద్ద ఉంచాలి. లేదా .ఇంట్లోనే ఎవరూ ముట్టని ప్రదేశంలో ఉంచాలి. కొన్ని రోజుల తరువాత దీనిని నీటిలో వేయాలి. చెత్తబుట్టలో రాఖీని అస్సలు వేయొద్దు.