ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి తీవ్రంగా చర్చించుకుంటోంది. ఇక్కడ జరిగిన ఆందోళనల కారణంగా ప్రభుత్వం ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రధాన పదవికి రాజీనామా చేశారు. హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహనా సైతం బంగ్లాదేశ్ ను విడిచి భారత్ లో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1971 యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాల పిల్లలకు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటాను కేటాయించడంపై ఆందోళనను మొదలయ్యాయి. ఇవి తారాస్థాయికి చేరి ప్రధాని రాజీనామా చేసేవరకు వచ్చాయి. కాగా ఈ ఆందోళన హింసలో వంద మందికి పైగా మరణించినట్లు స్థానిక వార్త సంస్థలు ప్రకటించాయి. ఈ తరుణంలో షేక్ హసీనా గురించి చర్చించుకుంటున్నారు? అసలు షేక్ హసీనా ఎవరు? ఆమె ఎక్కువ కాలంగా పదవిలో ఎలా కొనసాగారు? అనే వివరాల్లోకి వెళితే..
పాకిస్తాన్ భూభాగంలో కలిసి ఉన్న బంగ్లాదేశ్ 1971లో అవతరించిన విషయం తెలిసిందే. ఈ దేశం ఏర్పడిన తరువాత మొదటి ప్రధానిగా ముజిబుర్ రెహ్మాన్ ఆ దేశానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన అవామీ లీగ్ అనే పార్టీని స్థాపించారు. అయితే ఈయన పదవి చేపట్టిన కొన్ని నెలలకు అంటే 1975 ఆగస్టు 15న హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు ఆయన సతీమణిని కొందరు హత్య చేశారు. వీరి కుమార్తెనే షేక్ హసీనా. షేక్ హసీనా తల్లిదండ్రులు హత్యకు గురైనప్పుడ ఆమె బంగ్లాదేశ్ లో లేరు. అయితే 1981లో తిరిగి దేశానికి వచ్చారు.
ఆ తరువాత షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ తరుపున క్రీయాశీలక రాజకీయాల్లో ఉన్నారు. అయితే కొన్ని సార్లు వివిధ ఆందోళన నేపథ్యంలో గృహ నిర్బంధానికి గురయ్యారు. ఈ తరుణంలో 1991లో నేరుగా ఎన్నికల్లో పాల్గొన్న ఆమె పార్టీ మెజారిటీ సాధించలేదు. ఆ సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ పీ) అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ఐదేళ్లకు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అవామీ లీగ్ మెజారిటీ సీట్లు సాధించింది. దీంతో షేక్ హసీనా తొలిసారి ప్రధాని అయ్యారు.

షేక్ హసీనా ప్రధాని అయినప్పటి నుంచి వివిధ విపత్తులు ఎదుర్కొన్నారు. 2004లో ఈమె పార్టీ తీస్తున్న ర్యాలీపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి నుంచి షేక్ హసీనా తప్పించుకున్నారు. అయితే 2001లో ఆగస్టులో ఓటమి చెందిన అవామీ లీగ్ ఆ తరువాత 2008లో 250కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో 2009లో మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2014లో మరోసారి షేక్ హసీనా పార్టీకి ఎదురు లేకపోవడంతో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జనవరిలోనూ నాలుగోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
షేక్ హసీనా తండ్రి హత్యకు గురైన సమయంలో ఆమెకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. దీంతో 1996లో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినప్పటి నుంిచ భారత్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. 1971 సమయంలోనూ భారత్ అండగా ఉన్నట్లు షేక్ హసీనా తెలిపారు. అయితే ప్రస్తుతం షేక్ హసీనా మరోసారి భారత్ లో ఆశ్రయం పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె ఎక్కడా ఉన్నది మాత్రం రహస్యంగానే ఉంచారు.