Wednesday, June 25, 2025

ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు లేనట్లే?

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తరువాత జరిగేవి పంచాయితీ ఎన్నికలే. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్ ల పాలన రద్దయి అధికారుల పాలన కొనసాగుతోంది. తరువాత పంచాయతీ ఎన్నికలే ఉండనున్నాయి. ఇదివరకు ప్రకటించిన ప్రకారం అక్టోబర్ లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం సాగింది. కానీ రిజర్వేషన్ల అంశం తేలే వరకు వేచి ఉండక తప్పదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వ మదిలో ఎటువంటి ఆలోచన ఉందనేది సస్పెన్స్ గా మారింది. ఈ తరుణంలో కొన్ని గ్రామాలు పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. నిన్నటి వరకు అక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఆశించిన కొందరు నేతలకు నిరాశే ఎదురైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఓ ప్రతిపాదనలపై కొందరు ఆందోళన చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తరువాత డెవలప్మెంట్ సిటీగా కరీంనగర్ గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడే ప్రారంభమైంది. మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేసి ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్టేట్ వైడ్ గా పేరున్న బండి సంజయ్ కూడా కరీంనగర్ లోక్ సభ నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరీంనగర్ కు చెంని పొన్నం ప్రభాకర్ కీలక మంత్రిగా ఉన్నారు. ఈ తరుణంలో కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయని అంటారు.

ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా పోటీ రసవత్తరంగా ఉంటుంది. అవి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలైనా పంచాయతీ ఎన్నిలకైనా.. సర్పంచుల పాలన రద్దయిన తరువాత చాలా మంది ఆశావహులు టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లోతమ సత్తా చూపాలని ఇప్పటికే పావులు కదుపుతున్నారు. కానీ ఇంతలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఓ ప్రతిపాదన నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కరీంనగర్ సమీప గ్రామాలను కార్పొరేషన్ లో కలపాలని కలెక్టర్ కు ప్రతిపాదనను పంపారు. స్వయంగా మంత్రి ఈ ప్రతిపాదన చేయడంతో ఆ గ్రామాలు కరీంనగర్ కార్పొరేషన్ లో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కరీంనగర్ సమీప గ్రామాలపైన బొమ్మకల్, లక్ష్మిపూర్, దుర్శేడ్, గోపాల్ పూర్, చింతకుంట గ్రామాలు కార్పొరేషన్ లో కలిసే అవకాశం ఉంది. అయితే ఇక్కడి గ్రామాల్లో రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి కార్పొరేషన్ లో కలిస్తే కొందరు తమ పట్టు కోల్పోతారని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆందోళన చేస్తున్నారు. ఆదివారం చింతకుంట, గోపాల్ పూర్ సహా కొన్ని గ్రామాల వాసులు తమ గ్రామాలను కార్పొరేషన్ లో కలపొద్దని ఆందోళన చేస్తున్నారు. గ్రామాలు కార్పొరేషన్ లో కలవడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాజకీయంగా కొందరికి మాత్రం నిరాశే అని అంటున్నారు. ముఖ్యంగా వచ్చే సర్పంచ్ ల ఎన్నికల నాటికి ఆశలు పెట్టుకున్న వారంతా నిరాశ చెందుతున్నారు. మరి ఈ విషయంలో ఫైనల్ గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News