మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చులో అధిక దూరం ప్రయాణించాలంటే రైలు ప్రయాణమే సరైన మార్గం. అందువల్ల చాలా మంది దూర ప్రయాణాలు చేయాలని అనుకునేవారు రైలు టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. విహార యాత్రలకు వెళ్లాలని అనుకునేవారు, ఏదైనా వ్యాపారం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని అనుకునేవారు స్లీపర్ టికెట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కాస్త సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలని అనుకుంటే ఏసీ కోస్ బుక్ చేసుకుంటారు. అయితే అనుకున్న సమయంలో ప్రయాణం చేయాలంటే ఒక్కోసారి టికెట్లు అందుబాటులో ఉండవు. ఇలాంటి సమయంలో వెయిటింగ్ లిస్ట్ ఉంటే వెంటనే వాటిని బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ లో బుక్ చేసుకుంటే ఆ తరువాత కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ కన్ఫామ్ కాకపోతే స్లీపర్ క్లాసుల అడ్జెస్ట్ అయి ప్రయాణించవచ్చు. కానీ ఇక నుంచి అలా కుదరదు. ఎందుకంటే?
భారత రైల్వే 2025 మే 1 నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. స్లీపర్, ఏసీలో ప్రయాణం చేయాలనుకునేవారి విషయంలో కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రయాణికులు వెయిటింగ్ లిస్టులో ఉంటే ఆ టికెట్ తో ఏదో విధంగా స్లీపర్ లేదా ఏసీ కోచ్ లో ప్రయాణం చేయడానికి సౌకర్యం ఉండేది. కానీ ఇక నుంచి ఇలా వెయిటింగ్ లిస్ట్ లో టికెట్ బుక్ చేసుకునేవారు.. కన్ఫామ్ కాకపోతే జనరల్ లో వెళ్లాల్సి ఉంటుంది. స్లీపర్ గాని, ఏసీ కోచ్ లో గాని వెళ్లే అవకాశం లేదు. ఇది కాదని స్లీపర్ లేదా ఏసీకోచ్ లో ప్రయాణం చేస్తే చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
అయితే కన్ఫామ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇక నుంచి టికెట్ బుక్ చేసుకునేవారు.. వెయిటింగ్ లిస్ట్ టికెట్ బుక్ చేసుకునే విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఆ ట్రైన్ ప్రయాణానికి చివరి వరకు కన్ఫామ్ కాకుంటే జనరల్ బోగిలోకి వెళ్లాలి. అది ఇష్టం లేని వాళ్లు వేరే తేదీల్లో ప్రయాణం చేయడానికి అనుగుణంగా మార్చుకోవాలి. అవీ కన్ఫామ్ అయితేనే బుక్ చేసుకోవాలి. అయితే తప్పనిసరి ప్రయాణం చేయాలని అనుకునేవారు మాత్రం బుక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఇక నుంచి రైల్వే స్టేషన్ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేస్తే స్లీపర్ లేదా ఏసీ కోచుల్లో ఇప్పటి వరకు ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పుడు అనధికారికంగా ఇలా ప్రయాణం చేయడానికి అధికారులు ఒప్పుకోరు. ఎందుకంటే చాలా మంది రిజర్వ్ టికెట్ ఉన్న వారు.. ఇలా టికెట్ తో స్లీపర్ లేదా ఏసీ కోచుల్లో ప్రయాణం చేసేవారితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే బోర్డ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.