పెళ్లయిన తర్వాత ప్రతి జంట కోరుకునేది సంతానం. తనకు ఐదోతనం కావాలని మహిళా అనుకుంటే.. తన కూతురు లేదా కొడుకుతో ఆడుకోవాలని తండ్రికి అనిపిస్తూ ఉంటుంది. దీంతో కొందరు సంతానం కలుగుతుందని శుభవార్త తెలియగానే ఎగరి గంతేస్తారు. అయితే సంతానం కలిగిన తరువాత తమ పిల్లలతో పడే బాధలను తట్టుకోలేకపోతుంటారు. ఒక్కోసారి వీరిని పెంచడం ఎలా? అని చాలా మథనపడుతూ ఉంటారు. ఈ క్రమంలో పిల్లలు లేని సమయంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు… పిల్లలు పుట్టాక నిత్యం గొడవలు పడుతూ ఉంటారు. అసలు ఇలా గొడవలు రావడానికి కారణం ఏంటి? సంతానం కలిగిన తరువాతనే ఈ సమస్య ఎందుకు వస్తుంది?
తనను పట్టించుకోవడం లేదని…
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. అందుకే చాలామంది పెళ్లయిన తర్వాత వెంటనే తమకు పిల్లలు కావాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. మరి కొందరు మాత్రం తమ అన్యోన్యత దెబ్బతింటుందని వాయిదా వేస్తారు. అయితే పిల్లలు కోరుకునే వారికి అనుగుణంగా కూతురు లేదా కొడుకు పుట్టిన తర్వాత బిజీ అయిపోతారు. ముఖ్యంగా ఆడవాళ్లు పిల్లల అవసరాలు తీర్చడంలోనే నిమగ్నమవుతారు. ఈ క్రమంలో భర్తను అసలు పట్టించుకోరు. ఈ క్రమంలో ఒక్కోసారి భర్త తనను పట్టించుకోవడం లేదనే భావనతో భార్యపై కోప్పడుతూ ఉంటాడు. తనమీద ఎందుకు కోపం వస్తుందని భార్య సైతం తిరగబడుతుంది. ఇలా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమై పెద్దదిగా మారుతుంది.
మానసికంగా ఇబ్బందులు..

పిల్లలు పుట్టిన తర్వాత ఆడవారి మనస్తత్వంలో చాలా మార్పులు ఉంటాయి. వారికి పిల్లలతో ఎక్కువ సేపు గడపడం వల్ల ఒక్కోసారి నిద్రలేమి సమస్యలు కూడా ఎదుర్కొంటారు. దీంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడతారు. ఇలాంటి సమయంలో తనకు కొన్ని పనులు చేయాలని భర్త అడిగినప్పుడు తిరగబడుతుంది. అయితే భర్త ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే పర్వాలేదు. కానీ తన కోసం ఎలాంటి పనులు చేయడం లేదని వాదన పెట్టుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివి వాదనతో మొదలై గొడవలు తయారవుతాయి.
షికారులు, సినిమాలు కట్..
పెళ్లికి ముందు దంపతులు షికారులకు, సినిమాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ పిల్లలు పుట్టాక ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఇద్దరిలో ఆనందం కరువవుతుంది. ఫలితంగా అనుకోకుండానే చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది. ఈ కోపం పెద్దదిగా గొడవలకు దారి తీస్తుంది. ఈ సమస్య లేకుండా ఉండాలంటే కాస్త సమయం తీసుకుని దగ్గర ప్రదేశాలకు వెళ్లి రావడం మంచిది.
బాధ్యత ఇద్దరిది..
పిల్లలు కలిగిన తర్వాత వారి బాధ్యత ఇద్దరూ తీసుకోవాలి. కానీ కొందరు ఆడవారిదే బాధ్యత అంటూ మగవారు తప్పించుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెద్దదిగా మారి దూరం పెరుగుతుంది. అయితే పిల్లల అవసరాలు తీర్చడంలో ఇద్దరు బేధాభిప్రాయాలు లేకుండా ఉండడంవల్ల ఎలాంటి సమస్య ఉండదు.