ఫూలే బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ
కరీంనగర్: ఫూలే జయంతి ఉత్సవాలకు సరిపడా నిధులు కేటాయించాలని ఫూలే బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ కోరారు. శనివారం మహాత్మ జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సంధర్భంగా శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఫూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడారి అయిలన్న మాట్లాడుతూ ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ తన గురువుగా భావించిన ఫూలే ఎంతటిగొప్ప వారో అర్థంచేసుకోవచ్చన్నారు. సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత పూలే జయంతిని ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి సంవత్సరం తగిన నిధులు కేటాయించకపోవడం బాధాకరం అన్నారు. ప్రతి మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించాలన్నారు. ఫూలే ఏదో ఒక మతం కోసమో కులం కోసమో కాకుండా సమ సమాజ నిర్మాణానికి, ఆనాటి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఎన్నో అవమానాలు భరిస్తూ, బెదిరింపులకు భయపడకుండా బహుజనుల అభివృద్ధికి… ముఖ్యంగా స్తీల చదువుకు సమానత్వానికి తన భార్యనే టీచర్గా తీర్చిదిద్ది బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసిన పుణ్య దంపతులన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మ్యాకల పరశురాము, ఈరెల్ల విజయ్ కుమార్, నర్సింగోజు శ్రీనివాస్, గుంటి స్వరూప, కర్రే పావని, మీస రమాదేవి, మీస మాధురి తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.





