శ్రావణమాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. ప్రతి ఇంటా వ్రతాలతో సందడిగా ఉండనుంది. ఆషాఢమాసం ను శూన్యమాసంగా భావించి నెల రోజుల పాటు కొందరు ఆలయాలకు వెళ్లకుండా ఉంటారు. శ్రావణమాసంలో ప్రతిరోజూ ఆలయాల్లో దైవ దర్శనం చేసుకుంటారు. వీటిలో సోమ, శుక్ర, శనివారాలను ప్రత్యేకంగా భావించి ఈ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ నిర్వాహకులు సైతం శ్రావణమాసంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
శ్రావణమాసంతో పండుగల సీజన్ ప్రారంభం అయిందని అంటారు. ఇప్పటి నుంచి ఉగాది వరకు ఆలయాల్లో నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆలయాలను మూసివేస్తారు. అయితే ఓ ఆలయం ఏడాది పాటు మూసివేసి ఉంటుంది. కేవలం శ్రావణమాసంలో ఒక రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇంతకీ ఆ ఆలయం ఏది? ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఎక్కడ ఉంది?
శ్రావణమాసంలో శుభముహూర్తాలు, పండుగలు ఇవే.. – insightearth.in – Telugu News Portal
ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ లో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా సాగాయి. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించారు. పురాణాల ప్రకారం.. ఈ అమ్మవారిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చారని చెబుతారు. ఒక్కసారిగా ఉజ్జయినికి వెళ్తే.. ఇక్కడ ఉజ్జయిని అమ్మవారితో పాటు మరికొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిలో మహాకాళేశ్వర్ ఆలయం ఒకటి. జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ మహా శివుడు.. మహా కాళేశ్వర్ గా పిలవబడుతాడు. అంతేకాకుండా ఇక్కడ శివుడు దక్షిణ ముఖంగా ఉండడంతో దక్షిణ మూర్తి అని కూడా పిలుస్తారు.

మొదటి అంతస్థులో కొలువైన మహాకాళేశ్వర్ స్వామి
ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయం మూడు అంతస్థుల్లో ఉంటుంది. మూడు అంతస్థుల్లోనూ శివలింగాలు ఉంటాయి. మొదటి ఆలయంలో శివుడు మహా కాళేశ్వర్ గా పిలవబడుతాడు. రెండవ ఆలయంలో ఓంకారేశ్వర్ గా పిలవబడుతాడు. ఈ రెండు ఆలయాలు ఏడాది పొడవునా దర్శించుకోవచ్చు. కానీ మూడో అంతస్థులో ఉన్న నాగచంద్రేశ్వర ఆలయాన్ని ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శించుకోవాలి.
ప్రతీ శ్రావణ మాసంలో ఐదో రోజు నాగుల పంచమిని జరుపుకుంటారు. ఈరోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేస్తారు. నాగుల పంచమి ప్రారంభమైన అర్ధరాత్రి తలుపులు తెరిచి 24 గంటల పాటు మాత్రమే ఉంచుతారు. ఆ తరువాత మూసివేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నాగులపంచమి రోజున పుట్టలో పాలు పోస్తుంటారు. శివాలయాలను దర్శించుకుంటారు. కానీ ఈ రోజున ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరిచి ఉండే నాగచంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో శుభపలితాలు ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు.





