Tuesday, June 24, 2025

Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అందించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’పథకంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కేటగిరి వైజ్ గా ఆర్థిక సాయం చేసి.. అందులో కొన్నింటికి పూర్తిగా రాయితీ.. మరికొన్నింటికి కొంతవరకు రాయితీ ఇచ్చి మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు భరించుకునేలా ప్రణాళికలు వేసింది. ఈ మేరకు యువతి, యువకులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే?

రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి కేటగిరి 1 కింద రూ. 50 వేల విలువైన యూనిట్ ను మంజూరు చేయనున్నారు. ఈ యూనిట్ పొందిన వారికి పూర్తిగా రాయితీ అందుతుంది. దీనికి బ్యాంకు లింకేజీ అవసరం లేదు. అంటే లబ్ధిదారులు ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. కేటగిరి 2 కింద రూ. లక్ష వరకు సాయం పొందుతారు. ఇందులో 80% రాయితీ అందితే 10% లబ్ధిదారులు చెల్లించుకోవాలి. కేటగిరి 3 కింద రూ లక్ష నుండి 2 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో 20% లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. కేటగిరి 4 లో రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు పొందుతారు. దీనిపై 30% చెల్లిస్తే సరిపోతుంది.

అయితే 2,3,4 కేటగిరీల్లో ప్రభుత్వం అందించే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు భరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ మొత్తం కూడా బ్యాంకు ద్వారా రుణం ఇప్పించాలని తాజాగా నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు కేటగిరీ 4 కింద ఎంపికైతే వీరికి రూ.4 లక్షల సాయం అందుతుంది. ఇందులో 30 శాతం రాయితీ పోగా.. మిగిలిని మొత్తానికి బ్యాంకు రుణం అందుతుంది.

గతంలో ఇలాంటి పథకాలకు బ్యాంకు రుణాలు లేకపోవడం వల్ల లబ్ధిదారులు వీటిని సరైన విధంగా వినియోగించుకోలేకపోయారు. దీంతో అవి విజయవంతం కాలేదు. అంతేకాకుండా కొంతమంది లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోగా మిగతా మొత్తాన్ని భరించుకునే స్థితిలో కూడా లేరని గుర్తించారు. ఈ మేరకు లబ్ధిదారులు భరించే మొత్తాన్ని సైతం బ్యాంకు లింకేజీ ఉంటేనే ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకుంది. అంటే ఈ పథకం పొందిన వారికి బ్యాంకులు తప్పనిసరిగా రుణం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

బ్యాంకులు రూ. 1,600 కోట్లు రుణం ఇస్తే 5 లక్షల మందికి స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు అవుతాయి. అలాగే బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ. 4,639.81 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు ఉండకుండా లబ్ధిదారులకు ఉపయోగపడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News